రుద్రూర్, జనవరి 28: నేటి యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని రాణంపల్లి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సభాపతితోపాటు లింగేశ్వర గుట్ట పీఠాధిపతి పిట్ల కృష్ణమహరాజ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న వారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం శివాజీ విగ్రహాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. శివాజీ విగ్రహానికి పూలమాల వేసి, విగ్రహదాత పోచారం సురేందర్రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. శివాజీ ధైర్యసాహసాలను, నలుగురికి అండగా ఉండి ముందుకు నడిపే నాయకత్వాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పరిస్థితులను బట్టి అనవసర రాజకీయాలు చేసే వారిని, రెచ్చగొట్టేవారికి దూరంగా ఉండాలన్నారు.
ప్రజలు ఆలోచించి సమాజానికి ఉపయోగ పడే నాయకులను గుర్తించి, అభివృద్ధికి పాటుబడే నాయకులను చేరదీయాలని అన్నారు. పిట్ల కృష్ణ మహరాజ్ మాట్లాడుతూ.. శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ఎంపీపీ సాయిలు, సర్పంచ్ రోజాలక్ష్మణ్, పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, రైతు సమితి మండల అద్యక్షుడు సంగయ్య, అక్కపల్లి నాగేందర్ గ్రామస్తులు,కార్యకర్తలు పాల్గొన్నారు.