గ్యాస్ కట్టర్లతో లాకర్ ధ్వంసం
కాలి బూడిదైన రూ.7.35 లక్షల నగదు
8 కిలోల బంగారు ఆభరణాల అపహరణ
బుస్సాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఘటన
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని అనుమానం
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని బుస్సాపూర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.4 కోట్ల విలువైన సొత్తును దొంగలు అపహరించుకెళ్లారు. గ్యాస్ కట్టర్తో లాకర్ను ధ్వంసం చేసిన దుండగులు 8 కిలోల 30 గ్రాముల ఆభరణాలను తస్కరించారు. ఘటనా స్థలాన్ని సీపీ నాగరాజు పరిశీలించారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
మెండోరా, జూలై 4 : నిజామాబాద్ జిల్లా మెండో రా మండలం బుస్సాపూర్ గ్రామంలో బ్యాంకు చోరీ కలకలం రేపింది. భారీ మొత్తంలో సొత్తు అపహరణకు గురైంది. గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. జాతీయ రహదారికి 20 మీటర్ల దూరంలోనే మొదటి అంతస్తులో ఈ బ్యాంకు ఉం ది. బ్యాంకు పక్కన ఉన్న బీఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ కార్యాలయ ఆవరణలోకి మొదట ప్రవేశించిన దుండగులు అ క్కడ ఉన్న కుర్చీలను ఆసరాగా చే సుకొని బ్యాంకు మొ దటి అంతస్తులోకి ప్రవేశించారు. సీసీ కెమెరాలను పగులగొట్టి గదికున్న షట్టర్ తాళాలను ధ్వంసం చేసి రెండు ఫీట్ల వరకు పైకెత్తిలోపలికి ప్రవేశించారు. అనంతరం అలారం మోగకుండా వైర్లు కట్ చేశారు. సీసీ కెమెరాల డీసీఆర్ను తొలగించారు. అనంతరం దొంగలు వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ సహాయంతో బంగారం దాచి ఉంచిన లాకర్ను ముక్కలుగా కట్ చేశారు. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది షట్టర్ పైకి లేపి ఉంచడాన్ని గమనించి మెండోరా ఎస్సై శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు.
బంగారు అభరణాల లాకర్ ధ్వంసం
బంగారాన్ని తనఖా పెట్టి ప్రజలు నగదు తీసుకెళ్లగా వారి బంగారాన్ని దాచి పెట్టేందుకు ఉంచిన లాకర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సమయంలో గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో లాకర్లో ఉన్న రూ.7లక్షల 35 వేల నగదు ఖాళీ బూడిదైంది. లాకర్లో దాచి ఉంచిన 8 కేజీల 30 తులాల బంగారం మొత్తం ఎత్తుకెళ్లారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నగదుతో పాటు లాకర్లో ఉన్న బ్యాంకు లావాదేవీల పత్రాలు కూడా ఖాళీ బూడిదయ్యాయి. తనఖా పెట్టిన బంగారమే చోరీకి గురైందని అలాగే దాని పక్కనే ఉన్న సొంత బంగారు లాకర్ను తీయకపోవడంతో బ్యాంకు వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీం, డాగ్స్కాడ్తో క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ దుండుగులు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వారు తాకిన వస్తువులు, స్థలాన్ని శుభ్రం చేసి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. డాగ్స్కాడ్ బ్యాంకు నుంచి జాతీయ రహదారి 44 వెంట గ్రామ శివారులో ఉన్న చిన్న ఫ్లైఓవర్ వరకు వెళ్లి వెనుదిరిగింది.
డాగ్ స్కాడ్తో పోలీసుల తనిఖీలు
దొంగలు ఉపయోగించిన మాస్కు
బ్యాంకును పరిశీలించిన సీపీ
బుస్సాపూర్లోని బ్యాంకును సోమవారం కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు పరిశీలించారు. అలర్ట్ బెల్ ఎందుకు మోగలేదని బ్యాంకు మేనేజర్ రాజేశ్వర్గౌడ్ను అడిగి తెలుసుకున్నారు. అలర్ట్ బెల్ బిగించిన టెక్నీషియన్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని, ధ్వంసమైన లాకర్, బీఎస్ఎన్ఎల్ ఎక్సేంజ్ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకులో చోరీ చేసిన దుండగులు స్థానికులు కాదని, ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అని సీపీ అన్నారు. గతంలో సైతం సిద్ధిపేటలో, రాచకొండ, ఇందల్వాయి బ్యాంకుల్లో ఇదే తరహాలో చోరీ జరిగిందన్నారు. ప్రొఫెషనల్ దుండగులే ఇలా చోరీలకు పాల్పడతారన్నారు. గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో లాకర్లో ఉన్న నగదు ఖాళీ బూడిదైందన్నారు. రెక్కీ నిర్వహించాకే దోపిడీ కి పాల్పడ్డట్లు తెలుస్తుందన్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫి ర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దుండగులను త్వరలో పట్టుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్రావు, రూరల్ సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్రెడ్డి, సర్పంచ్ గోపిడి గంగారెడ్డి, బ్యాంకు రీజినల్ మేనేజర్ వివేక్, గ్రామస్తులు ఉన్నారు.