వేల్పూర్లో గ్యాస్ సిలిండర్లతో మహిళల నిరసన
మా కాలనీలోకి రావొద్దని ఎంపీకి హెచ్చరిక
పర్యటన రద్దు చేసుకున్న ధర్మపురి అర్వింద్
వేల్పూర్, జూలై 15: ఎంపీ ధర్మపురి అర్వింద్ గోబ్యాక్..అంటూ మహిళలు, డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీవాసులు గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించడానికి ఎంపీ అర్వింద్ వస్తున్నారని సమాచారం తెలుసుకున్న మహిళలు, కాలనీవాసులు రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తమకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని తెలిపారు. ఇండ్లులేనివారికి ఇండ్లు కట్టించారని అన్నారు.
ఎన్నడూలేని విధంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎంపీ అర్వింద్ గ్రామాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. వేల్పూర్లో డబుల్ బెడ్ రూం ఇండ్లను నాణ్యతతో నిర్మించారని తెలిపారు. అన్ని పనులు పూర్తయిన తరువాత ఎంపీ అర్వింద్ ఇక్కడికి రావడం ఎందుకు అని ప్రశ్నించారు.గ్యాస్ సిలిండర్ ధర విచ్చల విడిగా పెరుగుతున్నా ఎంపీ ఎం దుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీకి వస్తే అడ్డుకుంటామని స్ప ష్టం చేశారు. సాయంత్రం వరకు మహిళలు నిరసన వ్యక్తం చేయడంతో విషయం తెలుసుకున్న ఎంపీ వేల్పూర్ పర్యటనను రద్దుచేసుకున్నారు.
ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నడు..
ఎంపీ అర్వింద్ గెలిచినప్పటి నుంచి చేసిందేమీలేదు. ఏ ముఖం పెట్టుకొని ఊళ్లకు వస్తున్నడు. మంత్రి వేముల మాకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించిండు. మా సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్నడు. మా గ్రామానికి ఇప్పటి వరకు అర్వింద్ చేసిందేమీలేదు.
– కొమన్పల్లి సత్తెమ్మ, వేల్పూర్