డిచ్పల్లి, డిసెంబర్ 1: తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వర్సిటీ పరువును మంటగలుపుతున్నారని పాలకవర్గ సభ్యులు వసుంధరా దేవి, గంగాధర్గౌడ్ విమర్శించారు. ఈసీ మెంబర్లు గురువారం టీయూను సం దర్శించారు. వీసీ రవీందర్ను కలిసి ఏడాది కాలం గా ఖర్చు చేసిన నిధుల వివరాలను అడిగారు. ఈ సమయంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని చాంబర్లోకి వచ్చి వీసీని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లారు. ఈసీ మెంబర్లకు సమాధానం ఇ వ్వాల్సిన అవసరం లేదని ఈసీ సమావేశంలో చూ సుకోవచ్చని రిజిస్ట్రార్ చెప్పడం తమను అవమానించడమేనని వారు పేర్కొన్నారు.
అనంతరం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ రెండు నెలల క్రితం తాము ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ వద్దకు వెళ్లి వీసీ తీరును వివరించామన్నా రు. ఏడాది దాటినా ఈసీ సమావేశం నిర్వహించ డం లేదని తెలుపగా, వీసీకి సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలిపారన్నారు. 27 నవంబర్ 2021న టీయూలో జరిగిన ఈసీ సమావేశంలో అప్పటి ఇన్చార్జి రిజిస్ట్రార్గా ఉన్న కనకయ్యను తొలగించి ఈసీ ఆమోదంతో ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్గా ని యమించామన్నారు.
అయితే డిసెంబర్9, 2021న ఈసీ ఆమోదం లేకుండా వీసీ రవీందర్ ఇన్చార్జి రిజిస్ట్రార్గా శివశంకర్ను నియమించారని తెలిపారు. అనంతరం మూడు నెలల్లో ఈసీ ఆమోదం తీసుకోకుండానే ఆయనను ఎక్స్టెన్షన్ ఇచ్చారని వివరించారు. తర్వాత శివశంకర్ను పక్కన పెట్టి ఇన్చార్జి రిజిస్ట్రార్గా విద్యావర్థినిని నియమించారన్నారు. ఈసీ మెంబర్ల దృష్టిలో ఇప్పటికీ యాదగిరి మాత్రమే రిజిస్ట్రార్గా ఉంటారని నవీన్ మిట్టల్ తమకు చెప్పినట్లు ఈసీ మెంబర్లు వివరించారు.
వర్సిటీలో ఈ – టెండర్లు లేవు..
ఏ యూనివర్సిటీలోనైనా రూ.లక్షకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటే ఈ-టెండర్లు పిలవాల్సి ఉంటుందని ఈసీ మెంబర్లు తెలిపారు. అయితే వీసీ మాత్రం ఎన్ని లక్షల వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఎలాంటి ఈ టెండర్లు పిలువకుండానే ఇష్టారీతిన కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. విభాగాల వారీగా ఎంత ఖర్చు చేశారో వివరాలు ఇవ్వాలని వీసీని అడిగినా సమాధానం లేదన్నారు. టీయూకు అన్ని రకాల వసతి సౌకర్యాలతో కూడిన మూడు క్యాంపస్లు ఉండగా ఇంటర్నేషనల్ సెమినార్ను జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హోటల్లో ఎందుకు నిర్వహించారని వారు ప్రశ్నించా రు. సావనీర్ పేరిట టీయూకు చెందిన ఒక మహి ళా అధ్యాపకురాలు కారు వేసుకుని మరీ అన్ని అనుబంధ ప్రైవేటు కళాశాలలకు తిరిగి డబ్బులు వసూలు చేశారని, నెలలు గడిచినా ఇప్పటి వరకు సావనీర్ను మాత్రం విడుదల చేయలేదన్నారు.
జువాలజీ విభాగాన్ని మెయిన్ క్యాంపస్లో ప్రారంభించాలని ఈసీలో తీర్మానం చేసినా వీసీ సౌత్ క్యాంపస్లో ప్రారంభించారని ఆరోపించారు. నవీన్ మిట్టల్ వద్దని చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఉద్యోగుల వేతనాలు పెంచారని ఆరోపించారు. వీసీ, రిజిస్ట్రార్ పేషీల ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచారని తెలిపారు. ఈసీ వద్దని చెప్పినా దినసరి వేతనం పేరిట 25 మందిని ఉద్యోగాల్లో తీసుకున్నారన్నారు. వారికి వేతనాలు ఎలా చెల్లిస్తారని వీసీని ప్రశ్నిస్తే తనకు ఆ అధికారం ఉందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. అధ్యాపకుడు ప్రభంజన్యాదవ్కు చెల్లించిన ఎక్సెస్ అమౌంట్ను తిరిగి రికవరీ చేయాలని ఈసీ సమావేశంలో తీర్మానం చేసి ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.
వసుంధరాదేవీ అసలు టీయూ ఈసీ మెంబర్ కా దని ఆమెకు తనను అడిగే హక్కు లేదని వీసీ రవీందర్ తెలిపారు. ఈ విషయం ఉన్నత విద్యాశాఖ అధికారులు తమకు సమాచారం ఇచ్చారన్నారు.
మీడియాకు అనుమతి లేదు : విలేకరులపై వీసీ చిందులు
తన అనుమతి లేకుండా మీడియా ప్రతినిధులు యూనివర్సిటీలోనికి రాకూడదని వీసీ విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ పరువును మీడియా బజారున పడేస్తున్నదని అన్నారు. ఈసీ మెంబర్లు పిలిస్తేనే తాము వచ్చామని విలేకరులు చెప్పినా వీసీ, రిజిస్ట్రార్లు పట్టించుకోకుండా దురుసుగా వ్యవహరించారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక సిబ్బంది, అధ్యాపకులు అయోమయానికి గురయ్యారు. ఎవరినైనా ప్రశ్నించే అధికారం ఉంటుందని విలేకరు లు పేర్కొన్నా వీసీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.