ఇందూరు, ఆగస్టు 26 : ఆసరా పథకం కింద కొత్తగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సత్వరమే పెన్షన్లు పంపిణీ చేయాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 3 లోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఆసరా పెన్షన్లకు సంబంధించి జిల్లాలో కొత్తగా 48 వేల పైచిలుకు మంది లబ్ధిదారులుగా ఎంపికైనందున స్థానిక శాసనసభ్యులు ఎంపీడీవోలను సంప్రదించి వారి సమక్షంలో సత్వరమే కొత్త పెన్షన్ల పంపిణీని చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని డీఆర్డీవో అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రతిచోటా రైతు వేదికలు అన్ని సదుపాయాలు కలిగి ఉండేలా చూడాలని కలెక్టర్ వ్యవసాయాధికారులకు సూ చించారు. తప్పనిసరిగా నీటి సౌకర్యం ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా టాయిలెట్స్ వంటివి అసంపూర్తిగా ఉంటే గుత్తేదార్లతో వాటిని వెంటనే పూర్తి చేయించేలా చూడాలన్నా రు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల నుంచి ప్రతిరోజూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పల్లె, బృహత్ ప్రకృతి వనాల్లో ఖాళీ ప్రదేశాలను గుర్తిస్తూ విరివిగా మొక్కలు నాటాలని, మినీ పల్లెప్రకృతి వనాల కోసం అవసరమైన స్థలాన్ని త్వరితగతిన సేకరించాలన్నారు. జాతీయ రహదాలకిరువైపులా పచ్చదనం పెంపొందేలా ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో హరితహారం విజయవంతానికి శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్ పాల్గొన్నారు.