బోధన్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలో పండుగలకు పూర్వ వైభవం లభిస్తోందని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, బోధన్, ఎడపల్లి ఎంపీపీలు బుద్దె సావిత్రి, శ్రీనివాస్, బోధన్ జడ్పీటీసీ లక్ష్మి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.
బోధన్ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, ప్రతీ పండుగకు ప్రభుత్వం నుంచి అందే సాయమే కాకుండా, ఎమ్మెల్యే సొంతగా సాయం చేస్తూ పలు కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడని అన్నారు. బోధన్ నియోజకవర్గంలోని లక్షా 568 మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో రాజేశ్వర్ వివరించారు. వివిధ కారణాలతో వైద్యం చేయించుకున్న, దవాఖానాల్లో చికిత్సలు పొందుతున్న 183 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పి. గంగాధర్ గౌడ్, సంజీవ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.