పంచుతూ ఉంటే పెరిగేది విద్య. తనలాగే విద్యార్థులు, క్రీడాకారులు ఉన్నతులుగా ఉండాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నారు ఆయన. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తూ క్రీడల్లో ప్రతిభ చూపేలా.. వ్యాయామ విద్యలో రాణించేలా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే దోమకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీడీ నర్సింహారెడ్డి. దోమకొండ పరిసర ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ వ్యాయామ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందాలనే లక్ష్యంతో తయారు చేస్తున్నారు. క్రీడా అకాడమీ నెలకొల్పి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
-దోమకొండ, నవంబర్ 22
దోమకొండ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పీడీ నర్సింహారెడ్డి వ్యాయామ విద్య అభ్యసించాలనే విద్యార్థులను పోత్సహిస్తున్నారు. వారిలో లక్ష్యాన్ని, పట్టుదలను పెంచుతున్నారు. నిత్యం క్రీడాకారులు, విద్యార్థులతో సాధన చేయిస్తున్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టగ్ఆఫ్వార్ ఆటల్లో తర్ఫీదునిస్తున్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులను గుర్తించి మెరుగైన శిక్షణ అందించేందుకు 2017లో క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 5:30 నుంచి 7:30 గంటల వరకు సాయంత్రం బాలుర పాఠశాలలో 5 నుంచి 7గంటల వరకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు.
పూర్తి ఉచితంగా శిక్షణ..
క్రీడలంటే మక్కువ ఉండి సరైన శిక్షణ లేక ఎంతో మంది విద్యార్థులు క్రీడల్లో రాణించలేక పోతున్నారు. పేద, మధ్యతరగతి వారికి కనీసం క్రీడా పరికరాలు కోనేంత స్థోమత ఉండడం లేదు. దీనిని గుర్తించి పీడీ నర్సింహారెడ్డి సొంత డబ్బులతో క్రీడాపరికరాలను సమకూర్చారు. ఆటలంటే ఇష్టం.. మాకు శిక్షణ ఇవ్వండి అని వచ్చిన ప్రతి ఒక్కరిని రాటుదేలేలా చేస్తున్నారు. క్రీడల్లో వారి సామర్థ్యాలను రోజురోజుకూ పెంచుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించేలా కృషి చేస్తున్నారు. అంకితభావంతో అటు వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే ఇటు క్రీడాకారులను తయారు చేస్తున్నారు.
క్రీడాకారులను వ్యాయామ ఉపాధ్యాయులుగా…
తన వద్ద శిక్షణ తీసుకొని క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రీడలతోపాటు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వారిని వ్యాయామ విద్యపై ప్రోత్సహిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం డీపీఎడ్, బీపీఎడ్లో క్రీడాకారులు ప్రతిభ చూపేలా శిక్షణ అందిస్తున్నారు. తాను నేర్పిన నైపుణ్యంతో ప్రతి సంవత్సరం డీపీఎడ్, బీపీఎడ్లో ఉత్తమ ర్యాంకులు సాధించి వ్యాయామ విద్యలో చేరుతున్నారు. ఈ ఏడాది ముగ్గులు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం విశేషం.
శిక్షణ ఎంతో ఉపయోగపడింది
పీడీ నర్సింహారెడ్డి శిక్షణ ఎంతో ఉపయోగపడింది. క్రీడల్లో మెలకువలు, ఆటల వారీగా పూర్తి వివరాలను నేర్పించారు. పరీక్షలకు ముం దస్తుగా ఉదయం, సాయంత్రం వేళ్లలో శిక్షణ ఇచ్చారు. దీంతో క్రీడలపై పట్టుసాధించగలిగాం. ఈ ఏడాది పీఈఈ సెట్లో 6వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన కృషి మరువలేం.
– విజయ్,పీఈఈ సెట్ 6వ ర్యాంకు
క్రీడాపరికరాలను సమకూర్చారు.
పీఈఈ సెట్ రాయాలంటే క్రీడలపై అవగాహన, ఆటల్లో ప్రతిభ తప్పనిసరి. ప్రైవేటు శిక్షణ సంస్థల్లో చేరాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. వేలకు వేలు ఫీజు చెల్లించాల్సిందే. మాలాంటి పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన సహకారం మరువలేం.
– ప్రభాస్, పీఈఈసెట్ 43వ ర్యాంకు
జాతీయ, రాష్ట్రస్థాయిలో ఆడించాలనే లక్ష్యం
విద్యార్థులకు మంచి శిక్షణ అందించి జాతీయ, రాష్ట్రస్థాయిలో ఆడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. క్రీడ ల్లో రాణించినా భవిష్యత్తుపై మార్గదర్శనం లేకుండా పోతోంది. క్రీడాకారులు వ్యాయామ విద్యను అభ్యసిస్తే మంచి ఉపాధి దొరుకుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.
– నర్సింహారెడ్డి, పీడీ, దోమకొండ