Kotagiri | కోటగిరి, మే 1 : : రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడితోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రుర్ శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు నిర్వహించే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పోతంగల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో రైతులతో సమావేశం నిర్వహించి పంటల సాగు సస్యరక్షణ పై అవగాహన కల్పించారు.
శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి మాట్లాడుతూ వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందడానికి రసాయనాలు అధికంగా లేదా తప్పుగా వాడితే నేల ఆరోగ్యం పర్యావరణం మరియు మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందన్నారు. పంట అవసరాలు, నేలలోని పోషకాల స్థాయి కీటకాల ప్రబలత వంటి అంశాలను పరిగణoలోకి తీసుకొని సరైన మోతాదు సరైన సమయంలో సరైన విధానంలో ఎరువులు మరియు రసాయనాలు వాడాలని సూచించారు. భూసార పరీక్ష ఆధారంగా ఎరువులను వాడాలన్నారు. కీటకాలు తెగుళ్లు ఉన్నప్పుడే మందులు వాడాలని సిఫారసు చేసిన మోతాదులోనే కీటక నాశకాలు వాడాలని సూచించారు. రసాయనాలు, ఎరువులను సమంజసంగా ఉపయోగించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడమే కాకుండా భూమి ఆరోగ్యాన్ని మరియు ప్రకృతి వనరులను కూడా సంరక్షించుకోవచ్చని సూచించారు. రైతులు శాస్త్రీయ సూచనలు పాటించి సమతుల్య మరియు అవసరానికి అనుగుణంగా ఎరువులు రసాయనాలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంధ్య హనుమండ్లు, ఉమ్మడి కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, డైరెక్టర్ సాయిలు, పోతంగల్ మండల వ్యవసాయ అధికారిణి నిషిత, రైతులు పాల్గొన్నారు.