నిజామాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నది. రోజుకు పదుల సంఖ్య లో వచ్చిన కేసులు ఇప్పుడేకంగా వేలల్లో వెలుగు చూస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల్లో అవగాహన చర్యలు చేపట్టిన సర్కారు.. ఇప్పటికే మాస్కు వాడకాన్ని తప్పనిసరి చేసింది.మాస్కు వాడకపోతే రూ.వేయి జరిమానా విధిస్తూ ఆదేశాలు సైతం జారీ చేసింది. తాజాగా కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తుంది. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. మే ఒకటో తారీఖు వరకు ఆంక్ష లు కొనసాగుతాయి. అత్యవసరం సేవలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
రాత్రి కర్ఫ్యూలో భాగంగా ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు- 2005 ప్రకారం వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలను రాత్రి 8గంటల్లోపే మూసెయ్యాలని సూచించింది. రాత్రి తొమ్మిది గంటల అనంతరం ఇష్టానుసారం గా రోడ్లపై తచ్చాడితే మాత్రం కఠిన చర్య లు తప్పవని ప్రభు త్వం జారీ చేసిన జీవోలో పేర్కొన్నది. మంగళవారం ఉదయం జారీ అయిన జీవో ప్రకారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పోలీసులు రాత్రి కర్ఫ్యూ అమలు చేశారు. ఇప్పటికే పలు మండలాల్లో అనేక గ్రామాలు స్వచ్ఛంద లాక్డౌన్తో స్వీయ నియంత్రణ చర్యలు పాటిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కర్ఫ్యూతో కట్టడి చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా వచ్చే వారు బస్సు, రైలు, విమాన టికెట్లు వెంట పెట్టుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
కర్ఫ్యూ సమయంలో బయట తిరుగొద్దు : సీపీ
నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 20 : కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఐదు గంటల వరకు జిల్లాలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటికి రావొద్దని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రి ఎనిమిది గంటల్లోపే ప్రజలు తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లాలని సూచించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు రైలు, బస్సు టికెట్లను తమ వెంట ఉంచుకోవాలని, దవాఖానకు వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.