పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి జిల్లాలో దాదాపు 20వేల దరఖాస్తులకు మోక్షం
దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో కొత్త కార్డుల జారీ
సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షాతిరేకాలు
నిజామాబాద్, జూన్ 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసి కొంత కాలంగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాల్సిందిగా ఆదేశించడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన వేలాది దరఖాస్తులకు మోక్షం లభించనుంది. తహసీల్దార్ లాగిన్ ఐడీ నుంచి పౌరసరఫరాల అధికారికి వచ్చే ప్రతి దరఖాస్తుదారుడికీ రేషన్కార్డు చేతికి రానుంది. రెండేండ్ల క్రితం కొత్తగా కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించగా మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు అవకాశం ఇచ్చారు. సీఎం తాజా నిర్ణయంతో కొత్త కార్డులు జారీ చేసేందుకు కసరత్తు మొదలైంది. కొత్త రేషన్ కార్డుల కోసం నిరుపేదలు, కొత్తగా పళ్లైన వారు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారంతా నిరీక్షిస్తున్నారు. కొందరికి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యావసర వస్తువులకు సంబంధించి బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా చేస్తున్నప్పటికీ మున్ముందు ఎంతో ప్రయోజనం ఉండవచ్చనే ఆశతో ఆహారభద్రత కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఆమోదం ఇలా…
ఆహారభద్రత కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు 15 రోజుల్లో కొత్త కార్డులు జారీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు ఆదాయం కలిగిన వారికి, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగిన ఎవరైనా కొత్త ఆహార భద్రత కార్డులు పొందేందుకు అర్హులు. ఆదాయ ధ్రువీకరణతోపాటు నివాస ధ్రువీకరణ, ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు తొలుత తహసీల్దార్ లాగిన్కు వెళ్తాయి. వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి విచారణ నిమిత్తం రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారికి అప్పగిస్తారు. దరఖాస్తుదారుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతరం అర్హులను గుర్తించి ఆన్లైన్లో పొందుపరిచిన అర్జీని ఆమోదిస్తారు. ఈ దరఖాస్తులు తిరిగి తహసీల్దార్ లాగిన్కు వెళ్తాయి. ఆయన ఆమోదించిన దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ అధికారి లాగిన్కు పంపుతారు. పౌరసరఫరాల శాఖ అధికారి ఆమోదిస్తే చాలు ఇక కొత్త కార్డు పొందవచ్చు. ఏ ఆధారంలేని ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వితంతువులకు అంత్యోదయ కార్డులను అందిస్తారు. ఎలాంటి ఆధారం లేని అత్యంత నిరుపేదలు అన్నపూర్ణ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉభయ జిల్లాల్లో 20వేల దరఖాస్తులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా 20వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నిజామాబాద్లో 13,655 రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డిలో 6259 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం రెండు జిల్లాల్లో 19, 914 కార్డులు త్వరలోనే జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డులే కాకుండా మ్యుటేషన్(మార్పులు, చేర్పులు) కోసం దరఖాస్తులు భారీగానే వచ్చాయి. నిజామాబాద్లో మ్యుటేషన్ కోసం 27,920 మంది, కామారెడ్డిలో 16,703 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది. చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు అందాలంటే ఆహార భద్రత కార్డులు తప్పనిసరి. వీరందరికీ ప్రతినెలా ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ అందిస్తున్నారు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి పరిమితి లేకుండా ఒక్కో వ్యక్తికి ఆరుకిలోల చొప్పున బియ్యం, అంత్యోదయ కార్డుదారులకు రూ.35 కిలోల చొప్పున అందిస్తున్నారు. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే అందుతున్నా పేదలు కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు.
ఐరిస్తో సరుకుల పంపిణీ…
ప్రజాపంపిణీ వ్యవస్థలో వినూత్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. అక్రమాలకు చోటు లేకుండా ఎప్పటికప్పుడు వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తోంది. సంపూర్ణ ప్రక్షాళనతో గాడిలోకి వచ్చిన పౌరసరఫరాల వ్యవస్థ మరింత కట్టుదిట్టమైంది. ఈ-పాస్ విధానం ద్వారా రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ద్వారా లబ్ధిదారుల వేలిముద్రల ఆధారంగా బియ్యం పంపిణీ జరుగుతూ వచ్చింది. ఫలితంగా అక్రమాలకు అడ్డుకట్ట పడడంతోపాటు నేరుగా నిజమైన లబ్ధిదారుడికి మేలు చేకూరుతోంది. ఈ-పాస్లో వేలిముద్రలు పడని వారికి రేషన్ బియ్యం పంపిణీ కాసింత అవరోధంగా మారుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న విధానానికి పెద్దపీట వేస్తూ చర్యలు తీసుకుంది. ఐరిస్ విధానం ద్వారా రాయితీ బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ-పాస్ విధానాన్ని 2017లో మే నెల నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. డీలర్ల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ పౌరసరఫరాల శాఖ ఉన్నతా ధికారులు మాత్రం పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు వెనుకడుగు వేయలేదు. దాదాపుగా ఏడాదిన్నర కాలం నుంచి అమలవుతున్న ఈ విధానంలో నెలకు కోట్ల రూపాయలు ఆదా అవుతోంది. కరోనా సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఓటీపీ ద్వారా కూడా సరకులు పంపిణీ చేస్తుండడం విశేషం.
ప్రభుత్వాదేశాల ప్రకారం కొత్త కార్డులు మంజూరు
ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ అర్హతను బట్టి కొత్త కార్డులు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకు సైతం దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులన్నింటినీ పరిశీలన చేసి మంజూరు చేస్తాం. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గల మార్గదర్శకాల మేరకు కొత్త ఆహార భద్రత కార్డులు నిర్ణీత వ్యవధిలోనే జారీ చేస్తాం.