నిజామాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్షేత్ర స్థాయి పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పంప్హౌస్లు, అండర్ గ్రౌండ్ పైప్లైన్, ఇతరత్రా పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. జల వనరుల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ రంగ సంస్థలైన నవయుగ, మెగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెమ్మదిగా సాగుతున్న పనులపై మంత్రి వేముల అసహనం వ్యక్తం చేశారు. వేగం పెంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పురోగతిలో ఉన్న పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే వారిని ప్రోత్సహించారు. ప్యాకేజీ 20, 21 ద్వారా రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకుంటుందని మంత్రి వేముల చెప్పారు. జూన్ నాటికి 20వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా మెంట్రాజ్పల్లి పంప్హౌస్ పనులు శరవేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి వేముల, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఓ రకంగా అధికార యంత్రాంగాన్ని, కాంట్రాక్టర్లను ఉరుకులు పరుగులు పెట్టించారు.
సారంగాపూర్ నుంచి మొదలై…
సోమవారం ఉదయం 10 గంటలకు సరిగ్గా కాళేశ్వరం ప్యాకేజీ 20, 21 పనులను పరిశీలించేందుకు బయల్దేరిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేరుగా సారంగాపూర్ పంప్హౌస్ పనులను పరిశీలించారు. అక్కడ అధికారులను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బినోల నుంచి టన్నెల్ నిర్మాణాల స్థితిగతులపై ఆరా తీశారు. కాంక్రీట్ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. పనుల్లో ఇంకా వేగం పెంచాలని సూచించారు. అనంతరం నిజాంసాగర్ ప్రధాన కాలువను ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. అక్కడ నుంచి బయల్దేరి మోపాల్ మండలంలోని గడ్కోల్ పంప్హౌస్ను, మంచిప్ప పనులను పరిశీలించారు. మంచిప్ప చెరువును తిలకించారు. ఇక్కడ పంప్హౌస్ నిర్మాణం విశిష్టతను, ఇక్కడి నుంచి రెండు మార్గాల్లో వేర్వేరుగా నీటి తరలింపు ప్రక్రియ తీరును ఇంజినీర్లు కూలంకశంగా వివరించారు.
ఇక్కడి నుంచి డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి పంప్హౌస్ను మంత్రి, ఎమ్మెల్యే సందర్శించారు. ఇక్కడ పంప్హౌస్ పనులు పురోగతిలో ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా నెల రోజుల్లో పనులు ముగింపునకు చేరే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. పుప్పాలపల్లిలో అంతర్గత పైప్లైన్ వ్యవస్థను, సికింద్రాపూర్ మెయిన్ లైన్ పనులకు నేషనల్ హైవే అడ్డు ఉండడంతో జాతీయ రహదారి అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. వర్క్ ఏజెన్సీతో మాట్లాడి పైప్లైన్ పూర్తి చేసి రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పడ్కల్ మెయిన్ లైన్, కలిగోట్ మెయిన్ లైన్, కప్పలవాగు మీద చేంగల్, బడా భీంగల్ మెయిన్ లైన్లు క్రాసింగ్ పనులు పరిశీలించారు. మొత్తంగా దాదాపుగా ఎనిమిది గంటల పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర పర్యటన సాగింది.
ఇరిగేషన్ అధికారులకు రైతులు సహకరించాలి
సాగునీరు అందని భూములకు నీటి వసతి కల్పించడమే లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.వేల కోట్లు ఖర్చు చేసి సీఎం కేసీఆర్ పనులు చేయిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ప్యాకేజీ 20, 21 పనులను పరిశీలించిన ఆయన మెంట్రాజ్పల్లిలో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లాలో మెట్పల్లి ప్రాంతానికి ప్యాకేజీ 20, 21 ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. ఇందులో నిజామాబాద్ రూరల్ పరిధిలో 1.20లక్షలు ఎకరాలు, ఆర్మూర్లో 6వేలు, మెట్పల్లిలో 20వేల ఎకరాలకు నీరు అందించడానికి ఈ ప్యాకేజీ పనులు ఉద్దేశించబడినవని వివరించారు. బినోల నుంచి ఎస్సారెస్పీ వెనుకభాగంలో టన్నెల్ ద్వారా నీరు తెచ్చి మాసాని దగ్గర నిజాంసాగర్ కెనాల్ వద్ద లిఫ్ట్ చేసి అక్కడి నుంచి మెంట్రాజ్పల్లి పంప్హౌస్కు తరలిస్తున్నట్లు తెలిపారు. గడ్కోల్ లైన్ మంచిప్ప చెరువు దగ్గర రెండు పంప్ హౌస్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పైప్లైన్ వచ్చే భూముల రైతులంతా పైప్లైన్ ఇరిగేషన్ అధికారులకు సహకరించాలని చేతులు జోడించి వేడుకుంటున్నట్లుగా మంత్రి విన్నవించారు. సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూమి లోతుల్లో పైపులు వేసి సాగు నీరును అందించనున్నట్లుగా చెప్పారు.
ఇవీ కూడా చదవండి…
జాగ ఉన్న పేదలందరికీ డబుల్ ఇండ్లు