కోటగిరి, జూన్ 4:ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో దేశ విదేశాల్లో పండిస్తున్న లాభదాయకమైన పంటల సాగుకు రైతులు ఆసక్తిని చూపుతున్నారు. ఉద్యానపంట సాగులోనే వైవిధ్యమైనది డ్రాగన్ ఫ్రూట్ సాగు. ఈ పంట సాగుకు తెలంగాణ రాష్ట్రంలోనూ అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేలింది. దీంతో జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభమయ్యింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఎత్తొండ క్యాంపునకు చెందిన రైతు సుబ్బారావు ఈ రకం పంటను సాగుచేస్తున్నాడు. గత అక్టోబర్ నెలలో మొదటి పంటను విక్రయించి లాభాలు పొందారు.
అన్ని రకాల నేలలు అనుకూలం..
డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. సేంద్రియ కర్బనంతో కూడిన ఎర్రని ఇసుక నేలలైతే మరింత శ్రేష్టం. ఎకరాకు రెండు వేల మొక్కలు, 500 సిమెంట్ స్తంభాలు అవసరం అవుతాయి. స్తంభానికి నాలుగు దిక్కులా రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుతో గుంతలు తీయాలి. నేల రకాన్ని బట్టి సాగుచేసిన రకానికి నీటి తడులను అందించాల్సి ఉంటుంది. సంవత్సరానికి రెండు సార్లు పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. 18 నెలల్లో పంట కాపునకు వస్తుంది. రాత్రి సమయంలో పూలు వికసిస్తుండడంతో ‘క్వీన్ ఆఫ్ నైట్’ అని కూడా పిలుస్తారు. ఒకసారి నాటితే 20 ఏండ్ల వరకు దిగుబడులు వస్తాయి.
మార్కెట్లో మంచి డిమాండ్..
పండ్లు చూడడానికి ఎరుపు గులాబీ రంగులు కలిసినట్టుగా ఉంటుంది. ఇందులో ఉండే నల్లని గింజలను ఆయుర్వేదంలో కూడా వాడతారు. కిలో రూ.200 నుంచి రూ.250 పలుకుతుంది. విలువైన పోషకాలు ఉన్న ఈపంట ఇటీవల వాణిజ్య పంట గా అవతరించడంతో పలు రాష్ర్టాల్లో ఔత్సాహిక రైతులు సాగు చేస్తున్నారు.
పది గుంటల విస్తీర్ణంలో సాగు..
సుబ్బారావు తన ఇంటి ఆవరణలో 10 గుంటల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్స్ పంట సాగు చేపట్టాడు. రెండేండ్ల క్రితం హైదరాబాద్ నుంచి రూ.70కి ఒక మొక్క చొప్పున 500 మొక్కలను కొనుగోలు తెచ్చి నాటాడు. మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే సిమెంట్ స్తంభాలను ఇంటి వద్దే తయారు చేయించుకున్నాడు. గత అక్టోబర్ మాసంలో మొదటి కాపు వచ్చింది. పండ్లను కిలో రూ.220కి ఇంటి వద్దే విక్రయించాడు. ఈ ఏడాది ఇంటి వెనుక భాగంలో ఖాళీగా ఉన్న భూమిలో మరో ఎకరం విస్తీర్ణంలో మొక్కలను నాటాడు.
ప్రభుత్వం సబ్సిడీ అందించాలి..
డ్రాగన్ ఫ్రూట్ ఎడారిజాతి మొక్క కావడంతో పెద్దగా నీరు అవసరం లేదు. పూత వచ్చిన 45 రోజుల్లో డ్రాగన్ ఫ్రూట్ తయారవుతుంది. మార్కెటింగ్ సమస్య కూడా ఉండదు. పిలకలు కత్తిరించి నాటుకోవడం ద్వారా సాగును విస్తరించా. ఎకరాకు రూ.ఆరు లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. ఒకసారి నాటితే 20 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. సాగు వ్యయం ఎక్కువ కాబట్టి ప్రభుత్వం సబ్సిడీ అందించాలి. ఈ పండు పలు రకాల వ్యాధులను నయం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
-సుబ్బారావు, రైతు, ఎత్తొండ క్యాంప్.
పంటసాగు లాభధాయకం..
డ్రాగన్ ఫ్రూట్ పంట రైతులకు ఎంతో లాభధాయకం. మొక్కలు, సిమెంటు స్తంభాలకు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి అవసరం ఉంటుంది. పంటలో గులాబీ తెలుపు, పసుపుపచ్చ రకాలు ఉంటాయి. వీటిలో గులాబీ రంగు కాండ ఉన్న వాటికి మార్కెట్లో డిమాండ్ ఉంది. నాటిన 18 నెలల్లో కాపు వస్తుంది. రైతులు వీటి సాగుకు ముందుకురావాలి.