నిజామాబాద్, మే 4,(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరింత వేగాన్ని పెంచడం, సులువుగా టీకాలు వేసేందుకు గాను వైద్యారోగ్య శాఖ స్లాట్ బుకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ ప్రక్రియ అత్యంత సులువైనదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లలోనే రెండు నిమిషాల్లో వివరాలు నమోదు చేసుకుంటే కోరుకున్న సమయానికి, కోరుకున్న ప్రాంతంలో టీకాలు వేసుకోవచ్చని చెబుతున్నారు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక నిర్ణీత సమయానికి కేంద్రానికి వెళ్తే సరిపోతుంది. ఆన్లైన్లో కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అందులో సూచించిన విధంగా టీకా కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. టీకా కేంద్రాలోని డాటా ఎంట్రీ ఆపరేటర్కు నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్, గుర్తింపు కార్డును అందజేయాలి. వారు మనం ఇచ్చిన ఫోన్ నంబర్ ద్వారా ఆన్లైన్లో టీకా నమోదును క్షణాల్లో పరిశీలించి ఆన్లైన్లో అప్లోడ్ పూర్తి చేసి టీకా వేసుకునేందుకు అనుమతిని ఇస్తారు. దీంతో వ్యాక్సినేటర్ టీకా ఇస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు లక్షా 60వేల మందికి కొవిడ్ టీకాలు ఇచ్చారు. 43 కేంద్రాల్లో 10 అర్బన్ హెల్త్ సెంటర్లు, 22 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 8 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బోధన్ ఏరియా దవాఖాన, నిజామాబాద్ జనరల్ దవాఖాన, రైల్వే దవాఖానల్లో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నది.
స్లాట్ బుకింగ్ చేసుకోవడం ఇలా..
స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికే టీకా కేంద్రాల్లో వాక్సిన్ ఇచ్చేలా వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా ఏ రోజు ఎంతమందికి టీకాలు వేయాలో కచ్చితమైన సమాచారం ఆరోగ్య శాఖకు చేరుతుంది. దీంతో నిర్ణీత మోతాదులోనే వాక్సిన్లను అందుబాటులో ఉంచుకొని పంపిణీ చేయనున్నారు. స్లాట్ బుకింగ్తో ఎంతమంది వచ్చి నా.. ఒక రోజు ముందే వైద్యారోగ్య శాఖ సన్నద్ధం అయ్యే వీలు ఉంది. స్మార్ట్ఫోన్, కంప్యూటర్లో selfregistration. cowin. gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి టీకా వేయించుకునే వారు తమ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. వెంటనే ఫోన్కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ను వెబ్సైట్లో నమోదు చేస్తే తర్వాత ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు, పాన్కార్డులో ఏదో ఒకటి నమోదు చేసి రిజిస్ట్రేషన్ బటన్పైనా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో టీకా కోసం నమోదు చేసుకున్న వ్యక్తి వివరాలు పేజీలో కనిపిస్తాయి. ఇందులోనే మరో ముగ్గురి పేర్లను సైతం నమోదు చేసుకోవచ్చు. అందుకు పేజీలోనే యాడ్ మోర్ బటన్ క్లిక్ చేశాక వచ్చే పేజీలో వారి వివరాలు నమోదు చేయాలి. అనంతరం వచ్చే పేజీలో రాష్ట్రం, జిల్లా, మండలం, పిన్కోడ్, టీకా వేసుకునే తేదీ, సమయం, డోసు, టీకా పంపిణీ కేంద్రం వంటి వివరాలను పూరించి క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు చూపిస్తుంది
వేగంగా, సులువుగా వ్యాక్సినేషన్..
సెకండ్ వేవ్లో కరోనా వైరస్ ఉధృతంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నది. ప్రభుత్వం సైతం కరోనా కట్టడికి అనేక మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో వ్యాక్సినేషన్ ప్రక్రియను చురుగ్గా నిర్వహిస్తున్నది. కేంద్ర సర్కారు నుంచి సహకారం లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల కోసం వ్యయప్రయాసలకోర్చి ముందుకు వెళ్తున్నది. డిమాండ్కు తగ్గట్లుగా వ్యాక్సిన్ తెప్పించడం, వెనువెంటనే ఆయా జిల్లాలకు దానిని నిర్ణీత ప్రమాణాల్లో ఫ్రీజర్లో భద్రపరిచి తరలించడం వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నది. టీకా పంపిణీ కేంద్రాలకు చేరిన వ్యాక్సిన్లను జాగ్రత్తగా కొవిడ్-19 నిబంధనల మేరకు అర్హులైన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. జనవరి ఆరంభంలో మొదలైన ఈ ప్రక్రియలో భాగంగా మొదట్లో ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకాలు వేశారు.
అనంతరం వయస్సు ప్రాతిపదికన టీకాలు వేస్తున్నారు. ప్రస్తుతం టీకాలు వేయించుకునేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అపోహలు వీడి టీకాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. టీకా తీసుకునే వారి వివరాల నమోదు విషయంలో ఆరోగ్య సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ ప్రకారం వివరాలు నమోదు మూలంగా విలువైన సమయం వృథా అవుతున్నది. కీలకమైన సమయంలో కొవిడ్ సేవల్లో తలామునకలైన వైద్య సిబ్బంది చాలా మంది కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియలో కాసింత మార్పులు చేసింది. ముందస్తు వివరాల నమోదుతో వాక్సిన్ సెంటర్లకు ప్రజలు రావాలని సూచిస్తున్నది. తద్వారా పీహెచ్సీ, సీహెచ్సీ, యూహెచ్సీ, ఏరియా దవాఖాన, జిల్లా వైద్యశాలల్లో టీకా పంపిణీలో సంక్లిష్టతలు తొలగిపోనున్నాయి. ప్రజలు తాము బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం ఇలా వచ్చి అలా టీకా తీసుకొని వెళ్లే ఆస్కారం కలుగుతున్నది.
స్లాట్ బుకింగ్తో ప్రజలకే మేలు..
స్లాట్ బుకింగ్ ద్వారా టీకాల పంపిణీ వేగంగా, అత్యంత సులువుగా జరుగనుంది. మొన్నటివరకు టీకా కేంద్రానికి ఎంతమంది, ఎప్పుడు వస్తారో అంచనా ఉండేది కాదు. తద్వారా అప్పటికప్పుడు సిబ్బందిని నియమించుకోవడం, వచ్చిన ప్రజలకు వసతి కల్పించడం కష్టంగా మారింది. ఇప్పుడు ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకోవడం ద్వారా ఆరోగ్య సిబ్బందికి ఏ రోజు ఎంతమంది టీకా కోసం వస్తారో తెలుస్తుంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా ప్రజలకు రిస్క్ తప్పుతుంది. టీకా వేసుకోకుండా ఇంటికి తిరుగుముఖం పట్టే పరిస్థితులు ఉండబోవు.