నిజామాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఎనిమిదేండ్లుగా అమలవుతున్న ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 91,700 కుటుంబాలకు లబ్ధి జరిగింది. వీరికి సర్కారు ద్వారా అందిన మొత్తం సాయం రూ.918కోట్లు కావడం విశేషం. ఆడబిడ్డల వివాహాలకు అందిస్తున్న ఆర్థిక సాయం పథకం ఇప్పటికే దేశ వ్యాప్తంగా పేరుగాంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని వారికి ఈ పథకం అండగా నిలిచింది. గతంలో ఆడపిల్లల వివాహాలకు చాలా మంది తల్లిదండ్రులు అప్పులు చేసేది. పొలాలు అమ్ముకునేది. ఆస్తులను కుదువ పెట్టేది. పేద కుటుంబాల్లో ఇలాంటి చింత ఇప్పుడు పూర్తిగా తొలగి పోయింది. రూ.లక్షా 116తో వైభవంగా పెండ్లి జరుపుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినట్లు అయ్యింది. 2014, అక్టోబర్ 2న ప్రారంభమైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఇప్పుడు ఎనిమిదేండ్లు పూర్తి చేసుకొని ఎంతో మంది ఆదరణకు నోచుకుంటోంది.
ఉమ్మడి జిల్లాలో రూ.918 కోట్లు పంపిణీ…
నిజామాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మి ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు 39వేల 500 మందికి రూ.395.45 కోట్లు వెచ్చించగా… షాదీముబారక్ పథకం కింద 15,600 మందికి రూ.156.18కోట్లు అందించారు.మొత్తం 55,100 మందికి రూ.551.63కోట్లు వెచ్చించారు. కామారెడ్డి జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 32వేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది. షాదీ ముబారక్ కింద 4600 కుటుంబాలకు మేలు జరిగింది. మొత్తం 36,600 కుటుంబాలకు గాను రూ.366.42కోట్లు వెచ్చించడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 91,700 మందికి రూ.918.05కోట్లు పంపిణీ చేశారు. వరకట్నాన్ని భారతీయ చట్టాలు నిషేధించినప్పటికీ బాహాటంగానే కట్నకానుకలు ఇచ్చి పుచ్చుకోవడం, ఆడంబరంగా పెండ్లి జరిపించడం అంటే వధువు కుటుంబంపై ఎనలేని భారమే. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ పేదింట్లో పెళ్లి భాజాభజంత్రీలు మోగుతున్నాయి. భారంగా మారిన ఈ తంతు ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారు. పెండ్లి కూతురుకు మేనమామలా ఆర్థిక సాయం చేసి శుభ కార్యంలో చేదోడుగా ఉంటున్నారు.
‘లక్ష’ణంగా సాయం…
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రారంభ దశలో ఆర్థిక సాయం రూ.51వేలతో మొదలైంది. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో రూ.లక్షా 116కు చేరింది. ఆడబిడ్డల పెండ్లిలకు ప్రభుత్వం ఇస్తోన్న ఆర్థిక సాయం రూ.1,00,116 ఉండడంతో ఆయా కుటుంబాలకు నగదు సాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి అర్హతల్లో నిబంధనలను ప్రభుత్వం గతంలో సడలించింది. వార్షిక ఆదాయం రూ.లక్ష దాటితే పేదవారిగా గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించేవారు. మారిన పరిస్థితుల కారణంగా సీఎం కేసీఆర్ లబ్ధిదారుల వార్షిక ఆదాయాన్ని పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలుగా నిర్ణయించారు. పెద్ద మొత్తంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం చేస్తున్న ప్రభుత్వం… అర్హుల ఎంపిక, నిధుల మంజూరులో జాగ్రత్తలు తీసుకుంటూనే అర్హులైన వారందరికీ ఈ పథకం పేదింట ఆర్థిక కష్టాలను తీరుస్తోంది.
ఆడబిడ్డల తల్లిదండ్రులకు భారీ ఊరటను ఇస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అక్టోబర్ 2, 2014న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలినాళ్లలో కల్యాణలక్ష్మి సాయం రూ.51వేలు మాత్రమే అందించేది. 2017 మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయాన్ని రూ.51వేల నుంచి రూ.75,116లకు పెంచారు. ఇది కాస్తా 2018, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.లక్షా 116కు పెరిగింది.
బాలిక విద్యకు పరోక్ష భరోసా
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో బాలిక విద్యకు పరోక్షంగా పటిష్టవంతమైన భరోసా దక్కింది. గతంలో ఈ పథకానికి ముందు అనేక బాల్య వివాహాలు జరిగేవి. స్కూళ్లలో బాలికల డ్రాప్ అవుట్లు అనేకం కనిపించేది. ఇప్పుడు ఈ పథకం మూలంగా తగ్గుముఖం పట్టింది. ఈ పథకానికి అర్హత కావాలంటే వివాహా వయసు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు నిర్దిష్ట వయస్సు వచ్చే వరకు ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేయడం లేదు. కేసీఆర్ కానుకగా వచ్చే రూ.లక్షా 116 నగదు సాయంతో ఆర్భాటంగా వివాహాన్ని జరిపించుకునేందుకు చాలా మంది ఉత్సాహపడుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకే ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం అనేక పారదర్శక చర్యలను చేపట్టంది. చెక్కుల రూపంలో నేరుగా వధువు తల్లిదండ్రులకే ఆర్థిక సాయం చేరుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాల్లో బాల్య వివాహాలు సగానికి ఎక్కువగా తగ్గుముఖం పట్టాయని అధికారిక సమాచారం. కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సాయం లక్షా 116 రూపాయలతో పేదింట్లో వివాహ ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అమ్మాయిల వివాహాలకు తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే సాయం అందించడం దేశంలోనే ప్రథమం కావడం విశేషం.
కల్యాణలక్ష్మి పైసలతోనే పెండ్లి చేసిన..
పిల్లగాడు నచ్చిండు. పిల్ల కూడా మంచిగున్నడు చేసుకుంటా అన్నది…చేతిలో పైసలు లేవు…లగ్గం పెట్టుకున్నా…ఒక్కటే ధైర్యం కేసీఆర్ సార్ కల్యాణ లక్ష్మి పైసలు లక్ష వస్తాయి అనే నమ్మకంతోనే లగ్గం చేసిన. గింత కన్నా మంచి సీఎం సారు ఎక్కడా లేడు. లగ్గం చేసినంక కల్యాణలక్ష్మి పైసలు రాగానే ఎవరి పైసలు వాళ్లకు ఇచ్చినంకనే మనసు కుదుటపడ్డది.
-వడ్ల నాగమణి, రైతు కూలీ, గండివేట్, ఎల్లారెడ్డి మండలం
కేసీఆర్ సార్ పెండ్లి పెద్దయ్యిండు
నా కూతురు పెండ్లి చేయడానికి నా దగ్గర నయా పైసా లేకుండే. అప్పో సొప్పో చేద్దామన్నా గుండె నిండా బాధలే. అప్పు చేస్తే ఏం పెట్టి తీరువాలనుకున్నాం. కానీ కేసీఆర్ సారే పెండ్లి పెద్దగా అయ్యి మాకు కల్యాణలక్ష్మి ఇప్పించిండు. గుండెల మీది నుంచి బరువు తీసినట్లయ్యింది.
-పరండ్ల భారతి, ఇందల్వాయి
మా ఇంటికే కట్నం వచ్చిందనుకున్నాం
మా కూతురు హారికకు రెండు సంవత్సరాల క్రితం పెండ్లి చేశాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఆడబిడ్డల పెండ్లి చేయడం తప్పదు. అటువంటి పరిస్థితుల్లో మాకు కల్యాణలక్ష్మి వచ్చి ఎంతగానో ఆదుకుంది. తెలంగాణ ప్రభుత్వం మా కూతురుకు ఇచ్చిన కట్నంగా భావించాం. కల్యాణలక్ష్మి రావడంతో మాకు ఎన్నో ఇబ్బందులు దూరమయ్యాయి.
-పసుపుల లక్ష్మి, ఉప్లూర్, కమ్మర్పల్లి మండలం
కేసీఆర్ మాకు దేవుడు లెక్క
సీఎం కేసీఆర్ మాకు దేవుడు లెక్క ఆదుకున్నడు. మాకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడ పిల్లల పెండ్లీలు చేసిన తరువాత మా ఆయన చనిపోయిండు.మూడో కూతురు పెండ్లి చేయడానికి మగ దిక్కు లేని మాకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకం ఎంతగానో ఆదుకున్నది. సీఎం కేసీఆర్ మాకు పెద్ద కొడుకు వలే అండగా నిలిచిండు.
-జింక లింగవ్వ, చిక్కడ్పల్లి, రుద్రూర్ మండలం