వేల్పూర్, ఆగస్టు 16 : బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి జరగడంలేదని బీజేపీ నాయకుల ఆరోపణలను టీఆర్ఎస్ నాయకులు ఖడించారు. దీనిపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. మండల కేంద్రంలోని ఎక్స్రోడ్డులో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్రెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు బీజేపీ నాయకులు స్థలం..టైం చెప్పాలన్నారు. మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంపీ అర్వింద్ ఇప్పటి వరకు రూపాయి కూడా ఖర్చు చేశారా? అంటూ ప్రశ్నించారు.
మంత్రి ప్రత్యేక చొరవతో చెక్డ్యాములను పూర్తి చేయిస్తే.. వాటికి కేంద్రమే నిధులిచ్చిందని ఎంపీ అర్వింద్ చేప్పిన మాటకు కట్టుబడి ఉంటే వాటి వివరాలు స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేంటో చెప్పాలన్నారు. వరదలు వచ్చినప్పుడు మంత్రి పర్యటించలేదనడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బ్రిడ్జిలు, రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయించారని గుర్తుచేశారు. ప్రజలకు హామీ ఇవ్వకపోయినా.. భీమ్గల్ పట్టణంలో వంద పడకల దవాఖాన నిర్మిస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడంలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడడంలో అర్థం లేదన్నారు. ఆయన తమతో వస్తే ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయో.. చూపిస్తామన్నారు. మొదట తన నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్రెడ్డి, మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, భీమ్గల్ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ మండల కన్వీనర్లు దేవేందర్, దొన్కం టి నర్సయ్య, ప్రవీణ్రెడ్డి, ఏలియా, పుర్ణానందం, ఆర్టీఏ జిల్లా సభ్యుడు రేగుల్ల రాములు, కొట్టాల చిన్నారెడ్డి, సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.