నిజామాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశాన్ని ఏలుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోనే ఉన్న భౌగోళిక ప్రాంతం. స్వాతంత్య్రం సిద్ధించిన ఏడున్నర దశాబ్దాల్లో ఏ రాష్ర్టానికి వరించనన్ని పరిశ్రమలు, అభివృద్ధి తారా స్థాయికి చేరిన ఘటనలు అనేకం. ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది. వరుసగా రెండోసారి సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టిన ప్రాంతం నుంచి తెలంగాణకు భారీగా వలసలు కొనసాగుతున్నా యి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడూ కనిపించని స్థాయిలో వందలు, వేల సం ఖ్యలో పొట్టచేత పట్టుకుని బతుకు జీవుడా అనుకుం టూ తెలంగాణకు వస్తున్నారు. కూడు, గూడు కరువైన వారందరికీ తెలంగాణ రాష్ట్రమే అన్నం పెట్టి ఆదుకుంటున్నది. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచి ఉపాధికి ఢోకా లేకుండా భరోసాను కల్పిస్తోంది. హైదరాబాద్ ప్రాంతమే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా యూపీ, బీహార్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన కూలీలే దర్శనం ఇస్తున్నారు.
ఉత్తరాది కూలీలకు భారీ డిమాండ్
తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకోక మునుపు మన వద్ద వ్యవసాయ భూమి సాగు విస్తీర్ణం చాలా తక్కువ. భూ యజమానులే బదిలీ పద్ధతుల్లో, కూలీ కోసమో ఇతరుల పొలాల్లో కూలీనాలీ చేసేందుకు వెళ్లేవారు. బోర్లు ఉండి, భూగర్భ జలం పుష్కలంగా అందుబాటులో ఉన్న వాళ్లు మాత్రమే సాగు చేసే స్థితి. చెరువు కట్ట కింద భూములు లేదంటే డబ్బులున్న కుటుంబాలు మాత్రమే పొలం బాట పట్టేది. మిగిలిన వారు కరెంట్ లేక, బోర్లలో నీళ్లు రాక, చేతుల్లో పైసా లేక సాగంటేనే జడుసుకునే పరిస్థితి. స్వరాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే సాగుకు మంచి రోజులు వచ్చాయి. వచ్చి రాగానే నిరంతర విద్యుత్ అందించారు. ఆ తర్వాత 24గంటల పాటు వ్యవసాయానికి ఉచిత కరెంట్ సరఫరా చేశారు. కొద్ది రోజులకే మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి పథకాన్ని పూర్తి చేసి బీడు భూములకు సాగు నీరు పారించడంతో ఖాళీగా కూర్చునే రైతులే సాగులో బిజీ అయ్యా రు. కాలంతో పని లేకుండా యాసంగి, వానకాలాల్లో రెండు సార్లు పంటలు సాగు చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. తమ పొలాల్లో దర్జాగా పనులు చేసుకుంటున్న స్థానిక రైతులతో వ్యవసాయంలో ఏర్పడిన కూలీల కొరత కాస్త్త ఉత్తరాది వాళ్లకు కలిసి వస్తోంది. శ్రమకు తగిన గౌరవం దక్కుతుండడంతో వరుస కడుతూ వచ్చేస్తున్నారు.
బ్రోకర్ల దందా…
పానకంలో పుడక మాదిరిగా ఈ మధ్య కాలంలో ఉత్తరాది కూలీలను వ్యవసాయ పనుల్లో నిమగ్నం చేయడానికి బ్రోకర్లు వెలుస్తున్నారు. భాషా పరమైన ఇబ్బందులు ఏర్పడడంతో హిందీ మాట్లాడే స్థానికులే ఉత్తరాది కూలీలకు అనుసంధానంగా ఉంటూ స్థానిక అవసరాలకు మనుషులను పంపిస్తున్నారు. గంపగుత్తగా వ్యవసాయ పనులను చేతపట్టుకుని కూలీలకు డబ్బులిచ్చి మధ్యవర్తులు భారీగా పోగేసుకుంటున్నారు. పనుల నిమిత్తం తాత్కాలికంగా వచ్చిన వారికి ఫంక్షన్ హాళ్లలో, స్థానికంగా గుడారాలు ఏర్పాటు చేసి వసతి సౌకర్యం కల్పించడం, భోజనాలకు ఏర్పాట్లు చేయడంలో మధ్యవర్తులు కీలకంగా మారుతున్నారు. వ్యవసాయదారుల నుంచి పైకం వసూళ్లలోనూ మధ్యవర్తులే జిమ్మేదారుగా నిలుస్తుండడంతో ఆయా రాష్ర్టాలకు చెందిన వారంతా బ్రోకర్లనే గట్టిగా నమ్ముతున్నారు. ఒక్కసారి వచ్చిన కూలీలు ప్రతి సీజన్లోనూ ఇటు వైపు వరుస కడుతుండడంతో రోజురోజుకూ వలస వచ్చే వా రి సంఖ్య పెరుగుతున్నది. దీంతో గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత ఉత్తరాది ప్రజల మూలంగా తీరుతోంది. పనుల్లో వేగం, శ్రద్ధ కనబర్చడంలో ఉత్తరాది వాళ్లు ఈ ప్రాంత రైతులను ఆకట్టుకుంటున్నారు. చేసే మొత్తం పనికి అయ్యే ఖర్చు భారంగా లేకపోవడంతోనూ స్థానికులకు కలిసి వస్తోంది. సీజన్ వారీగా వచ్చిపోయే వారి సంఖ్య 1600 మంది వరకు ఉంటుదని ఓ అంచనా.
పరిశ్రమల్లో పర్మినెంట్గా...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7వందలకు పైగా రైస్ మిల్లులున్నాయి. వీటిల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ కూలీలే ఎక్కువగా పని చేస్తున్నారు. వీరంతా పర్మినెంట్గా కుటుంబాలతో సహా పొట్ట చేతపట్టుకుని స్వరాష్ర్టాలను వదులుకుని వచ్చిన వారున్నారు. వ్యవసాయ పనుల్లో సీజన్ వారీగా వస్తుండగా పరిశ్రమల్లో మాత్రం ఇక్కడే శాశ్వత నివాసంతో పిల్లాపాపలతో జీవనం సాగిస్తున్నారు. వీరు ఆరు నెలలకోసారి 20 రోజుల పాటు సెలవులు తీసుకుని తమ ప్రాంతాలు వెళ్లి వస్తున్నారు. పనులు చేయడంలో మొహమాటం లేకపోవడం మూలంగా వీరికి స్థానిక పారిశ్రామిక వేత్తలు మంచి వేతనాలతో గౌరవిస్తున్నారు. హమాలీలకు నెలకు రూ.25వేలకు తక్కువ కాకుండా సంపాదిస్తున్నారని రైస్ మిల్స్ అసోసియేన్ ప్రతినిధులే చెబుతున్నారు. ఉత్తరాది హమాలీలు లేకపోతే లోడింగ్, అన్లోడింగ్ కష్టతరంగా మారే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇక భవన నిర్మాణ రంగంలో, కార్పెంటర్ వర్క్స్లోనూ రాజస్థాన్, బీహార్ వాళ్లు పనులు చేస్తున్నారు. రూ.లక్షల్లో కాంట్రాక్టులు చేతపట్టి పనులు నిర్వహిస్తుండడం విశేషం. రోడ్డు నిర్మాణాల్లో, గుంతలు తవ్వకాల్లో, కంకర మిషన్లు, దవాఖానల్లో వాచ్మెన్లు ఆఖరకు హోటళ్లలో ఈ మధ్య ఈశాన్య రాష్ర్టాలకు చెందిన యువత సైతం పెద్ద ఎత్తున వచ్చి పనులు నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక్కడ చేతినిండా పని..
నేను బీహార్ నుంచి వచ్చాను. చదువుకున్నప్పటికీ ఉపాధి లేక ఇక్కడికి వచ్చాం. ప్రతి సీజన్లో ఇక్కడ నాట్లు వేసే పని దొరుకుతుంది. రోజుకు రూ. 500 నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ఇక్కడే ఉంటాం. ఇక్కడ అమలవుతున్న పథకాలు చాలా బాగున్నాయి. మాకు చేతినిండా పని దొరుకుతుంది.
-ఉనుపమ్ దాస్, బీహార్
అక్కడ పనులు లేక ఇక్కడికి వచ్చాం..
మా రాష్ట్రంలో పనులు లేకపోవడంతో పొట్ట చేత పట్టుకొని ఇక్కడకు వచ్చాం. కూలీ డబ్బులను వారానికి ఒకసారి భార్య, పిల్లలకు పంపిస్తాం. ఇక్కడి రైతులు కానీ వ్యాపారులు కానీ చాలా మంచి వాళ్లు. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా మంచి పథకాలను అమలు చేస్తుంది. కేసీఆర్ సారూ అంటే మాకు కూడా చాలా ఇష్టం.
-అరవింద్కుమార్, హమాలీ, బీహార్
ఇక్కడ పథకాలు చాలా బాగున్నాయి..
తెలంగాణలో సీఎం కేసీఆర్ సార్ అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయి. మా రాష్ట్రంలో ఇలాంటి ఇంత మంచి పథకాలు లేవు.. పెద్దగా వ్యవసా య పనులు ఉండవు.. పరిశ్రమలు ఉండ వు.. అక్కడ పనులు దొరక్క నాలుగేండ్ల క్రితం ఇక్కడి వచ్చాం. అక్కడ రోజుకు కేవలం రూ.300 వచ్చేవి. ఇక్కడ రూ.800 నుంచి రూ.1000 వస్తున్నాయి.
-దర్శన్, హమాలీ, బీహార్
ఇక్కడే ఉపాధి అవకాశాలు ఎక్కువ
భార్య పిల్లలను వదిలి ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చాను. ఇక్కడ ఉపాధికి కొదువ లేదు. ఏ పని అయినా చేసుకోవచ్చు. బీహార్ కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ. నాతో పాటు చాలా మంది ఇక్కడికి వలస వచ్చారు. ఇక్కడ కచ్చితంగా పని దొరుకుతుందని నమ్మకం ఏర్పడింది. ఇక్కడ పథకాలు చాలా బాగున్నాయి.
-సునీల్కుమార్, హమాలీ, బీహార్