జీవితంలో అందరికీ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారే స్నేహితులు. కష్టసుఖాల్లో తోడుంటూ ముందుకు నడిపిస్తుంటారు. సొంతవాళ్లకు చెప్పుకోలేని విషయాన్నీ ఫ్రెండ్స్కు చెప్పుకుంటాం. స్నేహితుల మధ్య నువ్వు- నేను అనే తేడాలు ఉండవు. స్నేహితులు అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడం కాదు. జీవితాంతం తోడుంటాననే ధైర్యాన్ని కల్పించడం. ముఖ్యంగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం. అందుకే స్నేహం ఓ వరం. స్నేహం అనేది పలకరింపుగా కాకుండా.. ఆదర్శవంతంగా ఉన్నప్పుడే అది నిజమైన స్నేహంగా వర్ధిల్లుతుంది. అలాంటి స్నేహమే చిరకాలం తోడుంటుంది. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఇందూరు, ఆగస్టు 6 : స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా..కడదాక నీడలాగ నిను వీడి పోదురా.. ‘దోస్త్ మేరా దోస్త్ తూహై మేరా జాన్ .. వాస్తవంగా దోస్త్ నువ్వే నాప్రాణం..’ అంటూ ఎందరో కవులు కవితలు, పాటలు రాసి స్నేహం గురించి, స్నేహంలోని మాధుర్యం గురించి చెప్పారు. అమ్మ అనే పదం తరువాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన వరం. అమ్మ, నాన్న , అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనమే ఎంచుకొమ్మని అవకాశం కల్పించారు. అందుకే మంచి స్నేహితుడిని సంపాదించుకొని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. మనలా ఆలోచించి గురువులా బోధించి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. సృష్టిలో తీయనైనది కలకాలం నిలిచిపోయేది స్నేహం. స్నేహానికి ఆస్తులు, అంతస్తులు, వయస్సుతోనూ పని లేదు. ప్రతి ఒక్కరితో కలిసి ఉండి సాదకబాధకాలను పంచుకునే వాడు స్నేహితుడు. అవసరమైనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఓదార్చే వాడే నిజమైన స్నేహితుడు.
పాఠశాల స్థాయిలోనే బీజం..
కొన్ని స్నేహాలు పాఠశాలలో ఏర్పడితే, మరికొన్ని కళాశాలలో ప్రారంభమవుతాయి. మరికొన్ని స్నేహాలు యుక్త వయస్సులో ఏర్పడుతాయి. విధి నిర్వహణ, ఉద్యోగ సమయంలో మొదలైన స్నేహాలు స్వచ్ఛంగా ఉంటే చివరి వరకు కూడా కొనసాగుతాయి. దాపరికం లేని స్నేహం కలకాలం వర్ధిల్లుతుంది. స్వార్థంతో కూడిన స్నేహం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. కష్టాల్లో వెన్నంటి ఉన్నవాడే నిజమైన స్నేహితుడిగా మిగిలిపోతాడు. ప్రతి బంధానికీ ఒకరోజు ఉన్నట్లే స్నేహ బంధానికి కూడా ఒక ప్రత్యేక రోజు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకొంటారు.
మా స్నేహం విడదీయలేనిది
మాది 55 సంవత్సరాల స్నేహం. నా స్నేహితుడు ఆనంపల్లి రాజబాపు, నేను మాణిక్భవన్ పాఠశాలలో హెచ్ఎస్సీ 1967-1968 వరకు చదువుకున్నాం. మా ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట. వాళ్లింట్లో ఏది వండినా నా కోసం తీసుకువచ్చి తినిపించేవాడు. ఇప్పటికీ వారానికొకసారి కలుసుకుంటాము. తను వ్యాపారంలో బిజీగా ఉన్నా ఒకే భావాలతో సమాజ హితం కోసం పని చేస్తాం.
-షేర్ల దయానంద్, విశ్రాంత ఉద్యోగి
50 ఏండ్ల దోస్తానా..
మా స్నేహం 1972లో ఖిల్లా జూనియర్ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరంలో మొదలైంది. 1981-1989లో కామారెడ్డి మండలం గర్గుల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నేను.. సంజీవ్రావు కోసం బిచ్కుందకు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లాను. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇద్దరం ఒకే దగ్గర ఉద్యోగం చేశాం. నేను 2013లో, నా స్నేహితుడు 2014లో రిటైర్ అయ్యాం. ఇద్దరం ఒకే ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాం.
-ముస్కు రామేశ్వర్రెడ్డి, లక్కంపల్లి సంజీవ్రావు
దశాబ్దాల స్నేహం…
నేను, నిమ్మల బాలకిషన్, గడీల సుదర్శన్ ముగ్గురం బాల్యస్నేహితులం. మాది సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం. నాలుగు దశాబ్దాల స్నేహం మాది. ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో చదువుకున్నాం. సెలవుల్లో మక్కచేను కాపలకు, అడవిలో పండ్లు ఏరుకోవడానికి, చెరువులో ఈత కొట్టడానికి కలిసే వెళ్లేవాళ్లం. ఉన్నత చదువుల కోసం కామారెడ్డిలో ఒకే గదిలో ఉన్నాం. కలిసి పోటీపడి చదువుకొని ముగ్గురం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడ్డాం. అవకాశమున్న ప్రతి సందర్భంలో ఒకరినొకరం కలుసుకుంటాం.
– కాసర్ల నరేశ్రావు, ఉపాధ్యాయుడు, నిజామాబాద్
24 ఏండ్లుగా మా స్నేహం కొనసాగుతుంది
నేను, నా స్నేహితుడు మహేశ్ కలిసి 6వ తరగతి వరకు చదువుకున్నాము. ప్రస్తుతం నేను ప్రభుత్వ ఉద్యోగిగా కామారెడ్డి జిల్లాలో పని చేస్తున్నాను. నా స్నేహితుడు మహేశ్ బాల్కొండలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. 24 సంవత్సరాలుగా మా స్నేహం కొనసాగుతుంది. ఎన్ని పనులు ఉన్నా నెలకోసారి కలుసుకుంటాము. ప్రతి పండుగకు ఒకరింటికి ఒకరం వెళ్తాం.
– సురేశ్