కామారెడ్డిరూరల్ జూన్ 25 : రోడ్డు ప్రమాదాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు లేని సురక్షిత జిల్లాగా కామారెడ్డిని మార్చాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ‘రోడ్డు భద్రత మన అందరి బాధ్యత’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ జితేశ్ పాటిల్ హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలని సూచించారు.
వచ్చే ఏడాది ప్రమాదాలు లేని జిల్లాగా కామారెడ్డిని మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడుపొద్దని, పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను తీసుకెళ్లవద్దని సూచించారు. ఇటీవల చోటుచేసుకున్న పలు ప్రమాదాలను కలెక్టర్ వివరించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది 263 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 282 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
253 చిన్న రోడ్డు ప్రమాదాల్లో 525 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ ఏడాది జూన్ 25 నాటికి 129 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 161 మంది మృతి చెందారని, 145 చిన్న ప్రమాదాల్లో 277 మందికి గాయాలయ్యాయని వివరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆటోలకు అతికించారు. మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేశ్, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.