నిజామాబాద్ స్పోర్ట్స్, డిసెంబర్ 22 : అర్హులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకునేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. 2024 జనవరి 1 నాటి కి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జనవరి 6న డ్రాప్ట్ రోల్ను ప్రచురిస్తామని, అభ్యంతరాలుంటే జనవరి 22 వరకు బూత్ లెవల్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాటిని పరిష్కరించాక ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉంటే వాటిని పరిశీలించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రతిపానదలు రూపొందిస్తామన్నారు. అదనపు కలెక్టర్ యాదిరెడ్డి పాల్గొన్నారు.
వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా పదో తరగతి విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థికీ అర్థమయ్యేలా నాణ్యమైన బోధన అందించాలన్నారు. ‘పది’ పరీక్షల సన్నద్ధత, ఉన్నతి లక్ష్య తదితర అంశాలపై ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీఈవో దుర్గాప్రసాద్, జీసీడీవో వనిత, ఏసీఈ విజయభాస్కర్ పాల్గొన్నారు.