ప్రైవేటు టీచర్లు, సిబ్బంది ఖాతాల్లో నగదు జమచేసిన ప్రభుత్వం
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ షురూ
ఉమ్మడి జిల్లాలో 7,403 మందికి లబ్ధి
ఇందూరు, ఏప్రిల్ 21 : కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. రెండు వేలు, 25 కిలోల సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమచేయగా, బుధవారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ప్రైవేట్ టీచర్లు సంతోషం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రాంతంలో ఉన్న 12వ నంబర్ రేషన్ దుకాణాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు.
చాలా సంతోషంగా ఉంది
కరోనాతో పాఠశాలలు మూసివేయడంతో మా ఇల్లు గడవడానికి కష్టంగా మారింది. సీఎం కేసీఆర్ మా ఇబ్బందులను అర్థం చేసుకుని రూ.2 వేలు, 25 కిలోల సన్న బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. ఉపాధి కోల్పోయిన మాకు కొంత ఊరట లభించింది.
రమేశ్,ప్రైవేట్ టీచర్