ఇంటి ముందు వేసిన రేకుల షెడ్డుకు విద్యుత్ సరఫరా
సంఘటనా స్థలంలోనే ఇద్దరి మృత్యువాత
బాన్సువాడ మండలం కాద్లాపూర్లో ఘటన
బాన్సువాడ రూరల్, జూలై 5 : అమ్మా.. లే అమ్మా.. నేను అర్జున్ను. చందూర్ స్కూల్ హాస్టల్ నుంచి వచ్చాను. లేవమ్మా, నాతో ఒక్క సారి మాట్లాడమ్మా అంటూ తల్లి మృతదేహాన్ని చూస్తూ కొడు కు అర్జున్ తన చిన్న చెల్లి చేతి వేలిని పట్టుకొని గుక్క పెడుతూ రోదించడం గ్రామస్తులందరి చేత కంటతడి పెట్టించింది. విద్యుదాఘాతంతో తల్లీకూతురు మృత్యువాత పడిన హృదయవిదారక సంఘటన బాన్సువాడ మండలంలోని కాద్లాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తుకారం ఇంటి ముందర రేకుల షెడ్డు ఉంది. గాలి దుమారానికి రేకులు ఎగిరిపోకుండా ఇనుప తీగను లాగి ఇంటి సందులో కట్టారు.
ఇదిలా ఉండగా షెడ్డులోని ఫ్యాను వైరు తెగి రేకులకు తగలింది. దీంతో రేకులతో పాటు షెడ్డు ఎగిరిపోకుండా కట్టిన తీగలకు విద్యుత్ సరఫరా అయ్యింది. తుకారాం కూతురు అక్షర (6) ఆడుకుంటూ వెళ్లి ఇనుప తీగను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలింది. గమనించిన తుకారాం భార్య అంకిత (25) పరుగున వెళ్లి కూతురిని పట్టుకోవడంతో ఆమెకు సైతం విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి కుమారుడు అర్జున్, మరో కూతురు ఆరాధ్య ఉన్నారు. తల్లీబిడ్డ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త తుకారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చుట్ట పక్కల గ్రామాల వారు తరలి రావడంతో ఘటనా స్థలం రోదనలు మిన్నంటాయి. భర్త తుకారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.