రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న అభయహస్తం గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ అంతటా షురూ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు చెప్పిన దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియకు పొంతన లేకుండా కనిపించింది. ఒక్కోచోట ఒక్కో విధంగా అన్నట్లుగా పరిస్థితులు దాపురించాయి. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తుల కోసం ప్రజలంతా ఆసక్తి చూపారు. జనాభా ఆధారంగా కౌంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది.
(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభయహస్తం దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొన్నది. ఇప్పటికే పిం ఛన్లు అందుకుంటున్న వారంతా మరోసారి అభయహస్తం దరఖాస్తు ఫారాలతో కౌంటర్ల వద్దకు వచ్చారు. పాత లబ్ధిదారులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఫారంలోనే స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వారికి అవగాహన కల్పించే వారు కరువయ్యారు. రేషన్కార్డుల విషయంలో జనమంతా అయోమయానికి గురయ్యారు. పాత రేషన్ కార్డుల్లో పేరున్న వారంతా కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలా? వద్దా? అని గందరగోళానికి గురయ్యారు. కొన్ని చోట్ల రేషన్కార్డుల కోసం దరఖాస్తులను టీమ్ లీడర్లు స్వీకరించారు. రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులే స్వయంగా చెప్పినప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొన్నది. కొత్తరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం ద్వారా ప్రభు త్వ సంక్షేమ ఫలాలు అందుతాయా? అందవా? అన్న మీమాంసలో ఉన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఉన్నతాధికారులు క్షేత్ర పర్యటనలకు బదులుగా ఆఫీసులకే పరిమితం కావడం ద్వారా పలు శాఖలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు మండలాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజలకు సహాయకారిగా అక్కడక్కడ అంగన్వాడీ సిబ్బందిని వాడుకున్నారు. 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల 6వ తేదీ వరకు కొనసాగుతుంది. మధ్యలో 2 రోజులు సెలవులు ఉండగా మిగిలిన రోజుల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని అధికారులు చెబుతున్నారు. అభయహస్తంలోని వివిధ పథకాలకు దరఖాస్తు చేసే క్రమంలో రేషన్ కార్డు జత చేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ రేషన్ కార్డు లేని వారి పరిస్థితిపై స్పష్టత కొరవడింది. దీంతో నూతనంగా వివాహాలు చేసుకుని వేరే కాపురం పెట్టిన కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారి పరిస్థితి గందరగోళంలో పడింది.
ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో వేర్వేరుగా ఏర్పా ట్లు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు స్వయంగా ఈ విషయాన్ని పర్యవేక్షించినప్పటికీ పలు లోటుపాట్లు కనిపించాయి. నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మొదటి రోజు పలుచోట్ల మిశ్రమ స్పందన వచ్చింది. అభయహస్తం పథకాలకు దరఖాస్తులో ఎక్కడా బ్యాంక్ అకౌంట్ వివరాలను అడగలేదు. దీంతో లబ్ధిదారులు, ఆశావహులంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ డీటైల్స్ లేకుం డా ఈ దరఖాస్తులను ఏం చేస్తారంటూ పలుచోట్ల ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ముందు జాగ్రత్తగా చాలా చోట్ల బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ను జత చేయగా తిరస్కరించారు. మహాలక్ష్మి పథకంలో రూ. 2500 సాయం, రైతుభరోసా కింద ఎకరానికి రూ. 15వేలు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, చేయూత పథకం ద్వారా పింఛన్లు వంటి వాటికి ఆర్థిక సాయాన్ని ప్ర భుత్వం ఏ విధంగా చేపడుతుందో అర్థం కాని దుస్థితి నెలకొన్నది. ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం సైతం మిన్నకుండి పోవాల్సి వచ్చింది.
బోధన్, డిసెంబర్ 28: ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో పొరపాట్లు ఉండకుండా చర్యలు చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. బోధన్ పట్టణంలోని 26వ వార్డులో ఏర్పాటు చేసిన అర్జీల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అర్హులందరూ పథకాలకు దరఖాస్తు చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో బి. రాజా గౌడ్, మున్సిపల్ కమి షనర్ ఎండీ ఖమర్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా వతి, విద్యుత్ శాఖ డీఈ ముక్తార్ అహ్మద్, మున్సిపల్ డీఈఈ లింగంపల్లి శివానందం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నిజాంసాగర్,డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. నిజాంసాగర్, మహ్మద్నగర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం అచ్చంపేట గ్రామంలో కలెక్టర్ జితేశ్తో కలిసి కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో, ప్రత్యేకాధికారి సాయాగౌడ్, మండల ప్రత్యేకాధికారి విజయ్భాస్కర్, ఎంపీడీవో నాగేశ్వర్, తహసీల్దార్లు భిక్షపతి, క్రాంతికిరణ్, ఎంపీవో అబ్బాగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 28: తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను తప్పనిసరిగా అమలుపరుస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి అన్నారు. నగర శివారులోని ఖానాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్యారెంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, కార్పొరేటర్ కోర్వ లలితాగంగాధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ క్రైం,డిసెంబర్ 28: ప్రజా పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శివాజీనగర్, 26వ డివిజన్లోని గౌడ సంఘంలో ప్రజాపాలనా కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీపీ శ్యామ్, కార్పొరేటర్ బంటు వైష్ణవీరాము, అధికారులు పాల్గొన్నారు.