హోటళ్లలో అందించే ఆతిథ్యం సరికొత్త పుంతలు తొక్కుతున్నది. ఎల్లప్పుడూ కొత్తదనం కోరుకునే వినియోగదారులను వినూత్న థీమ్లతో ఆకట్టుకుంటున్నది. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు.. పసందైన విందుతోపాటు వినోదాన్ని అందించేందుకు పెద్దపీట వేస్తున్నాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు ‘మార్పులు’ చేసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, మండీ సెంటర్లు ఫన్, ‘టేస్టి’క్ సేవలతో వినూత్నంగా ఆతిథ్యం అందిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్కోర్ట్స్ సరికొత్తగా ముస్తాబై కస్టమర్లను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.
– ఖలీల్వాడి, జనవరి 7
నిజామాబాద్ నగరంలో భోజనప్రియులను ఆకట్టుకునేలా కొంగొత్తగా హోటళ్లు వెలిశాయి. హైదరాబాద్ సిటీని పోలిన విధంగా నయా ఫుడ్కల్చర్ మొదలైంది. బ్రాండెడ్ బిర్యానీ సెంటర్లు క్యూ కట్టాయి. పసందైన రుచులతో కస్టమర్లను ఓవైపు ఆకట్టుకుంటూనే మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి సరికొత్తగా ముందుకు వచ్చాయి. వెరైటీ వంటకాలు, యూత్ను ఆకట్టుకునేలా డిజైన్ చేసిన రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. బిర్యానీ, బెస్ట్ఫుడ్ అందించే హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా, శివారు ప్రాంతాల్లో ఫుడ్కోర్ట్స్ ప్రారంభమయ్యాయి. సౌదీ, అరబ్ దేశాల్లో మాదిరిగా మండి బిర్యానీ కల్చర్ వచ్చింది. టేబుళ్లు, కుర్చీలు లేకుండా ఐదారుగురు వ్యక్తులు కిందనే పరుపుల్లో కూర్చొని తినేలా ఈ రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా నగరంలో ప్రిజన్(జైలు)మండి, రైలు బిర్యానీ, రోబో ఆతిథ్యమిచ్చే హోటళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులకు ఇష్టమైన ప్లేస్టేషన్తోపాటు ఇతర ఆటలు ఆడేలా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులు సైతం భోజన ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
-ఖలీల్వాడి, జనవరి 7
ఆతిథ్య రంగం ట్రెండ్ మారుతున్నది. కాలానుగుణంగా కస్టమర్ల అభిరుచుల మేరకు కొత్త పుంతలు తొక్కుతున్నది. హోటళ్లలో ఇప్పటి వరకు అతిథులకు ఆహ్వానం పలికిన ఎగ్జిక్యూటివ్లు, ఆర్డర్ తీసుకొని ఆహార పదార్థాలను సరఫరా చేసే స్థానంలో ప్రస్తుతం రోబోలు, రైళ్లు రంగ ప్రవేశం చేశాయి. సాధారణ వెయిటర్ చేసే పనులను అలవోకగా చేస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాల్లోనే లభిస్తున్న వీటి సేవలు మన వద్దకూ వచ్చాయి. నగరంలోని వినాయక్నగర్ ప్రాంతంలో జంక్షన్-65 పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది రైలుబండి మాదిరిగా ఉంటుంది. లోపల కూర్చునే టేబుళ్లు సైతం రైలు కంపార్ట్మెంట్లను పోలి ఉంటాయి. ఈ రెస్టారెంట్లో రైలు, రోబో మాత్రమే సర్వ్ చేస్తాయి. ఈ హోటల్కి వచ్చే పిల్లలు తెగ సంబురపడిపోతుంటారు. రైలుబండి బిర్యానీ, చపాతీలు తేవడాన్ని చూస్తూ కేరింతలు కొట్టడం వారి వంతవుతున్నది.
ఫుడ్ అండ్ ఫన్..
నిజామాబాద్ నగర శివారులోని హైదరాబాద్ రోడ్లో ఫుడ్ అండ్ ఫన్ కోసం ఏర్పాటు చేశారీ ఎఫ్-2. ఇక్కడ రెస్టారెంట్ భోజనంతోపాటు పిల్లలు సరదాగా గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం అయ్యిదంటే సందడే సందడి. హోటల్తోపాటు పిల్లలకు ఆటలే ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. రేసింగ్ కార్లు ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వివిధ రకాల ప్లేస్టేషన్ గేమ్స్, క్రికెట్, కారు గేమ్ చిన్నారులను ఆకట్టుకుంటాయి. గేమ్స్కి మాత్రం కొంత డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. రెస్టారెంట్ కన్నా పిల్లల ఆటలకే అధిక ఆదాయం వస్తుందని చెప్పొచ్చు.
అచ్చం జైలు మాదిరే..
నగరంలో రెస్టారెంట్ల మధ్య పోటీ పెరగడంతోపాటు జనాలను ఆకర్షించేందుకు సరికొత్త పంథాలో హోటళ్లు వెలిశాయి. ఆ ఐడియా నుంచి వచ్చిందే జైల్ మండి. రాజరాజేంద్ర చౌరస్తాలో జైలును పోలిన విధంగా రెస్టారెంట్ను తీర్చిదిద్దారు. రెస్టారెంట్లోకి వెళ్లగానే నల్లనిగోడలు, ఎటుచూసినా జైలు గేట్లు, గోడలకు తుపాకులు కనిపిస్తాయి. కస్టమర్లు తినేందుకు కూర్చునే గదులను బ్యారక్లా ఏర్పాటు చేశారు. సర్వీస్ బాయ్స్ ఖైదీ డ్రెస్సుల్లో వచ్చి సర్వ్ చేస్తున్నారు.
జైలులో ఉన్నట్లుంది..
జైల్ మండి అంటే ఏందో చూద్దామని వచ్చాం. చాలా బాగున్నది. జైలుని తలపించేలా ఉన్నది. సర్వీస్ చేసే వాళ్లు ఖైదీ డ్రెస్లు వేసుకొని రావడం అద్భుతంగా ఉన్నది. జైలులో కూర్చొని తిన్నట్లుగా అనిపిస్తుంది.
– వినోద్, డిచ్పల్లి
కొత్తదనం కోసం..
హైదరాబాద్లో జాబ్ చేసుకునేవాడిని. ఏదో ఒక కొత్తదనంతో మండి ఏర్పాటు చేయాలని నిజామాబాద్కి వచ్చాను. కొంతమంది సలహా తీసుకొని జైల్ మండి పెడితే ప్రజలు ఆకర్షితులై వస్తారని ఆలోచనతో ఏర్పాటు చేశాం. జైల్మండికి రెస్పాన్స్ చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి మండిని స్వీకరిస్తున్నారు.
-సుమన్, ప్రిజన్ మండి యజమాని
మొదట భయపడ్డాం..
హైదరాబాద్ సిటీలోని హోటళ్లను తలపించే ఆలోచనతో జంక్షన్-65ని ఏర్పాటు చేశాం. మొదటగా ఎలా రన్ అవుతుందోనని భయపడ్డాం. కానీ, చాలా బాగా నడుస్తున్నది. ఎక్కువగా ఫ్యామిలీలు వస్తుంటాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. రైలుబండి వస్తూ, పోతూ ఉంటే కేరింతలు కొడతారు.
-సిద్ధార్థ, జంక్షన్ 65 యజమాని
థ్రిల్లింగ్గా ఉంది..
ఏదైనా తిందామని ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్కి వెళ్లాం. ఇక్కడ సర్వ్ చేసే రైలు, రోబోను చూసి ఆశ్చర్యపోయాం. అచ్చం మనిషిలాగే సప్లయ్ చేస్తున్నాయి. థ్రిల్లింగ్గా ఉంది. వాటిని చూస్తూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ భోజనం చేస్తూ ఆనందంగా గడిపాం.
– మహేశ్,నిజామాబాద్
సందడిగా ఉంటుంది..
సాయంత్రం అయిందంటే పిల్లలతో చాలా సందడిగా ఉంటుంది. వీకెండ్లో చాలా పబ్లిక్ వస్తుంటారు. ఎక్కువగా యువత ఎఫ్-2ను సందర్శిస్తారు. ఫ్యామిలీతో వచ్చిన వారు రెండు, మూడు గంటలు ఎంజాయ్ చేసి వెళ్లేందుకు చాలా గేమ్స్, అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయి.
-నవీన్, ఎఫ్-2 యజమాని