సకల జనుల సమ్మిళిత అభివృద్ధి కోసమే కేసీఆర్ సర్కారు మొదటి నుంచి పాటు పడుతున్నది. రైతులు, మహిళలతోపాటు ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఆయా వర్గాలకూ పెద్దపీట వేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దశాబ్దాల కల అయిన ఎంప్లాయీస్ హెల్త్స్కీం అమలు చేయనుండడంతో ఎంతో మందికి మేలు చేకూరనున్నది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడంతో ఆ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. అలాగే, సెర్ప్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల నుంచి పే స్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది. సర్కారు నిర్ణయంతో నిజామాబాద్ జిల్లాలో 217మందికి లబ్ధి చేకూరనున్నది. ఏండ్ల కలను సాకారం చేసేందుకు కృషిచేసిన మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవితకు సెర్ప్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-కమ్మర్పల్లి, ఫిబ్రవరి 7
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 7: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. సెర్ప్ ఉద్యోగులతోపాటు పలు శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురును అందించింది. ఉద్యోగులకు నూతన హెల్త్ స్కీం అమలు ప్రకటనతో వారిలో హర్షాతిరేకాలు నింపింది. సెర్ప్ ఉద్యోగులు ఆదినుంచీ కోరుతున్నా గత పాలకుల హయాంలో సాధ్యం కాని పే స్కేల్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించి ఐకేపీ ఉద్యోగ వర్గాల్లో సంతోషం నింపింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను ఏప్రిల్ వరకు పూర్తి చేయనున్నట్లు ప్రకటించి వారి జీవితాల్లో వెలుగులు నింపనున్నది. బడ్జెట్ వేళ కేసీఆర్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాలతో నిజామాబాద్ జిల్లాలో సెర్ప్, కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగవర్గాల్లో సంతోషం నెలకొన్నది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తమ సమస్యల పరిష్కారంపై ఇచ్చిన సానుకూల దృక్పథం, తమకు అండగా నిలుస్తూ వస్తున్న రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారాన్ని జిల్లా ఐకేపీ ఉద్యోగవర్గాలతోపాటు జిల్లా ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు.
సెర్ప్ ఎంప్లాయీస్ వెతలు తీరేలా..
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,974 మందికి లబ్ధి చేకూరనుండగా, నిజామాబాద్ జిల్లాలో 217 మందికి లబ్ధి కలుగుతుంది. జిల్లాలో సెర్ప్ వర్గాల్లోని ఒక ఏపీడీ, ఆరుగురు డీపీఎంలు, 33 మంది ఏపీఎంలు, 62 మంది మండల సమాఖ్య సీసీలు, 115 మంది కమ్యూనిటీ సీసీలకు పే స్కేల్ ప్రయోజనం ప్రారంభమవుతుంది. నామమాత్రపు వేతనాలతో, డీఏ ప్రయోజనం లేక ప్రమోషన్లు, స్థాయిలు పెరిగినా వేతనల్లో ఆశించిన మార్పునకు అవకాశం లేక సెర్ప్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో 23 ఏండ్లుగా పోరాటాలు చేస్తూ వచ్చారు. వారి పోరాటాలను గుర్తించింది కేసీఆర్ సర్కారు మాత్రమే. వారికి మేనిఫెస్టోలో, ఏకంగా అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చి అండగా నిలిచిన తీరు కేసీఆర్కు వారి పట్ల ఉన్న సానుకూలతకు నిదర్శనం. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలుమార్లు ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ దృష్టికి వీరి వినతులను తీసుకెళ్లారు.
అన్నింటా ముందుంటూ..
రాష్ట్రంలోని సెర్ప్ ఉద్యోగుల్లో 90 శాతం మంది మరో 15 నుంచి 17 సంవత్సరాల్లో రిటైరవనున్నారు. పే స్కేల్ సవరణ వీరిలో ప్రత్యేకానందం నింపనున్నది. మహిళల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా.. వారు సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా అడుగడుగునా కృషి చేస్తున్న సెర్ప్ సిబ్బందికి పే స్కేలు సవరణ చేయనుండడం మహిళా సంఘాల్లోనూ సంతోషాన్ని నింపింది. కొవిడ్ మహమ్మారి మృత్యుతాండవం చేస్తున్న భయంకర పరిస్థితుల్లో సైతం సెర్ప్ సిబ్బంది భయపడకుండా మహిళా సంఘాల సభ్యుల ఇండ్లకు వెళ్లి మరీ రుణాల పంపిణీని ముందుకు తీసుకెళ్లారు. కొవిడ్ వ్యాప్తి నిర్మూలన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
వేతన జీవులకు ఊరట..
రాష్ట్రంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 11 వేల మంది కాంట్రాక్లు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నది కేసీఆర్ గవర్నమెంటు. ఇందుకు సంబంధించిన పలు అవాంతరాలు ఎదురైనా వారిని క్రమబద్ధీకరించే కృతనిశ్చయంతో ముందడుగు వేస్తూ వచ్చిన ప్రభుత్వం ఏప్రిల్ వరకు ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నది. నిజామాబాద్ జిల్లాలోనూ ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ కానున్నారు. నూతన హెల్త్ స్కీం అమలు నిర్ణయం ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా చిరువేతన జీవులకు వరంగా పేర్కొంటున్నారు. ఈ నూతన ఆరోగ్య పథకం జిల్లా ఉద్యోగుల్లోనూ భరోసాను నింపింది. కొత్త ఉద్యోగాల భర్తీలో వేగంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం.. నూతన ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.1000 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. జిల్లాలో కొత్త ఉద్యోగార్థులకు ఇది మరింత భరోసాను నింపింది.
ప్రేమతో చూశారు..
ఐకేపీ ఉద్యోగుల సమస్యలు, వినతులను ఆది నుంచి సీఎం కేసీఆర్ సానుకూల దృక్పథంతో చూశారు. సీఎంతోపాటు జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అందరూ మా వాళ్లే..అందులో వీరూ మా వాళ్లే అనే ప్రేమతో చూశారు. మా సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు సహకరించారు. పే స్కేలు శుభవార్త సందర్భంగా వారికి ధన్యవాదాలు.
-కుంట గంగారెడ్డి, సెర్ప్ ఉద్యోగుల
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హెల్త్ స్కీం హర్షణీయం..
ఉద్యోగుల చిరకాల ఆకాంక్ష హెల్త్ స్కీం. దీని అమలుకు ముందడుగు వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ నిర్ణయం సరికొత్త భరోసాను నింపింది. ఆరోగ్యపరంగా అండగా ఉంటుంది. నగదు రహితంగా, తక్షణంగా అండగా నిలబడే ఈ పథకం అందిస్తున్నందుకు ఉద్యోగులు సంతోషిస్తారు.
-ఎ.రాజేశ్వర్ గౌడ్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు