నిజామాబాద్, ఏప్రిల్ 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూవాడా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. 21 ఏండ్లు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ 22వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులు బుధవారం ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో గులాబీ జెండాలను ఆవిష్కరించి.. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించాయి. హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర ప్లీనరీకి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తరలి వెళ్లారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా టీవీల్లో వీక్షించారు. వివిధ అంశాలపై తీర్మానాల సందర్భంగా జరిగిన చర్చోపచర్చలను ఆసక్తిగా తిలకించారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి, దేశ రాజకీయ పరిస్థితులపై గులాబీ దళపతి చేసిన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించనున్న పాత్రపై అందరి దృష్టి నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాలు అంబరాన్నంటాయి. 21 ఏండ్ల సంబురాన్ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించాయి. ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. పల్లెలతో పాటు మండల కేంద్రాలు, పట్టణాల్లో పలువురు నాయకులు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. ప్లీనరీకి వెళ్లడానికి ముందే జిల్లా కేంద్రంతో పాటుగా నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్య నాయకులు టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గులాబీ కండువాలు ధరించి జైతెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఆ తర్వాత నాయకులు హైదరాబాద్కు పయనమయ్యారు.
మరోవైపు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ప్లీనరీ ఆద్యంతం ఆకట్టుకున్నది. ఆహ్వానాలు అందిన ముఖ్యనాయకులు, ప్రజా ప్రతినిధులంతా ప్లీనరీలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో పదవులు నిర్వహిస్తున్న వారితో పాటు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సభావేదికపై ఆసీనులయ్యారు. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద యం నుంచి సాయంత్రం వరకు ప్రజలంతా టీవీల్లో వీక్షించారు. తీర్మానాల ఆమోదం విషయంలో జరిగిన చర్చోపచర్చలను ఆసక్తిగా తిలకించారు.
తళుక్కుమన్న ఉమ్మడి జిల్లా నేతలు..
టీఆర్ఎస్ ప్లీనరీలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తళుక్కుమన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తారీక్ అన్సారీ సభా వేదికపై కనిపించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్తో పాటు మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి ప్లీనరీకి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్లీనరీలో టీఆర్ఎస్ విజయాలు, ఆవిష్కరణలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి వంటి అంశాలపై కులంకషంగా చర్చించారు. పరిపాలనా సంస్కరణలు, విద్యుత్రంగ అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు దేశానికి దిక్సూచిగా మారిన దళితబంధు పథకం, విద్య, వైద్య రంగాల్లో సాధించిన ప్రగతిని కండ్లకు కట్టినట్టు వివరించారు. రాష్ర్టాభివృద్ధికి సాగుతున్న ప్రగతి ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీలు సృష్టిస్తున్న అడ్డంకులను, కుయుక్తులను సీఎం కేసీఆర్ వివరించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది.
దేశ్కీ నేత కేసీఆర్..
హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ప్లీనరీలో పలు తీర్మానాల సందర్భంగా మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రసంగాలపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి, ధరల పెరుగుదల, సమాఖ్య విధానానికి విఘాతం కల్గిస్తున్న మోదీ చర్యలు, దళితబంధు పథకం, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు వంటి తీర్మానాలు ప్రవేశ పెట్టినప్పుడు వక్తలు చేసిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో దేశానికి దిశా నిర్దేశనం చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ముందడుగు వేయాలని కోరడంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మరో వైపు ప్రారంభోపన్యాసంలోనూ టీఆర్ఎస్ పాత్ర మరింతగా విస్తరిస్తుందని, దేశానికి చుక్కాని కాబోతోందంటూ స్వయంగా గులాబీ దళపతి చెప్పడంపైనా జనాలంతా ఆసక్తి చూపుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్రం గా సతమతమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న విధానాలు, సాధించిన విజయాలన్నీ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తున్నాయనే భావన ప్రజల్లో ఇప్పటికే బలపడింది. జల దృశ్యంలో 2001, ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ చరిత్రను లిఖించగా, 2022 ఏప్రిల్ 27న జరిగిన 21 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం కూడా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుందని గులాబీ నేతలు చెబుతున్నారు.