నిజామాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):చినుకు ఆగడం లేదు.. వానలు పోవడం లేదు.. జూన్లో మొదలైన వర్షాలు సీజన్ ముగిసినా తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ కుండపోత వర్షాలు పడుతూనే ఉన్నాయి. పంటలు చేతికొచ్చిన వేళ వెంటాడుతున్న వానలు కర్షకులను కలవరపెడుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. కేవలం నాలుగు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా, 21 మండలాల్లో అతివృష్టి (సాధారణం కన్నా 60 శాతానికి పైగా వర్షాలు) ఏర్పడింది. మరో 26 మండలాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది. వరుణుడి కరుణతో కరువు ఛాయలు కనుమరుగయ్యాయి. భూగర్భ జలాలు దండిగా పెరిగాయి. ఫలితంగా రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. రెండు జిల్లాల్లో కలిపి 10.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కాగా, కోత దశలో వెంటాడుతున్న వానలు అన్నదాతలకు కునుకు లేకుండా చేస్తున్నాయి.
వానాకాలం ముగిసినా వర్షాలు వదలడం లేదు. రైతుల కష్టాలు తీరడం లేదు. అతి భారీ వర్షాలతో అటు అన్నదాతలు, ఇటు జనాలు బెంబేలెత్తుతున్నారు. ఎప్పడో జూన్ మొదటి వారంలోనే మొదలైన వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. శీతాకాలం ప్రారంభమైనప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. 2022 సీజన్కు సంబంధించి వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలో 18 మండలాల్లో, కామారెడ్డి జిల్లాలో 3 మండలాల్లో అతివృష్టి నెలకొంది. కేవలం నాలుగు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన 26 మండలాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జూన్ నెలాఖరులోనే చెరువులు, కుంటలు, భారీ ప్రాజెక్టులు సైతం నిండాయి. ఉభయ జిల్లాల్లో 10.65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అయితే, వరుస వర్షాలతో సోయా పంట తీవ్రంగా దెబ్బతిన్నది. భారీ విస్తీర్ణంలో సాగైన వరి పంట ప్రస్తుతం గింజ దశలో ఉండగా, వానలతో ముప్పు ఏర్పడింది. దీంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఈ సమయంలో జాగ్రత్తలు పాటించి వర్షం ముప్పు నుంచి బయట పడాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
21 మండలాల్లో అతివృష్టి..
నిజామాబాద్ జిల్లాలో 29 మండలాలు ఉండగా, 18 మండలాల్లో అతి వృష్టి నమోదైంది. సాధారణ వర్షపాతం కన్నా 60శాతం ఎక్కువగా వానలు కురిస్తే అతి వృష్టిగా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. ఇలా బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట, నందిపేట, మాక్లూర్, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్ బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్లలో అతివృష్టి ఏర్పడింది. గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి కురిసిన కుండపోత వానలతోనే ఈ పరిస్థితి నెలకొంది. కోటగిరి, వర్ని, మోస్రా, చందూర్, నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్, మోపాల్, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండల్లో అధిక వర్షపాతం నెలకొంది. సగటు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 నుంచి 59 శాతం ఎక్కువగా వానలు కురిస్తే అధిక వర్షపాతంగా పేర్కొంటారు. నిజామాబాద్ జిల్లాలో ఒక్క రుద్రూర్ మండలంలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 890 మి.మీటర్ల వర్షం కురియాల్సి ఉండగా, 76.6 శాతం అధికంగా అంటే 1,557 మి.మీటర్ల వర్షం కురిసింది.
మాయమైన కరువు ఛాయలు..
కామారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల క్రితం వరకు కరువు ఛాయలు కనిపించేవి. 2018కి ముందు వరకు జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో తాగునీటికీ కటకటా ఏర్పడింది. అలాంటిది 2019 నుంచి ఆశాజనకంగా వర్షాలు కురియడంతో కరువు ఛాయలే లేకుండా పోయాయి. 22 మండలాలకు గాను ఈ సీజన్లో 3 మండలాల్లో అతివృష్టి నమోదైంది. కామారెడ్డిలో 90.7 శాతం, రాజంపేటలో 79.8, తాడ్వాయిలో 61.4 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన 16 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, పిట్లం, పెద్దకొడప్గల్, భిక్కనూరులో సాధారణ వర్షపాతం రికార్డయ్యింది.
రైతుల్లో గుబులు..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5.45 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 5.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 70 శాతం మేర వరి పంటనే వేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులు నేరుగా కల్లాలకు చేరుకుని ధాన్యాన్ని సేకరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మిగిలిన చోట్ల వరి కోతలు జోరందుకోనున్నాయి. ఈ తరుణంలో చెడగొట్టు వానలతో రైతుల్లో గుబులు నెలకొంది. శీతాకాలం ప్రారంభమైనప్పటికీ వానలు మాత్రం తగ్గక పోవడంతో కర్షకుల్లో ఆందోళన కొనసాగుతోంది. భారీ వానల మధ్య వరి పంటను సాగు చేసిన రైతులకు ధాన్యం గింజ చేతికి అందుతుందా? వర్షానికి నేలమట్టమవుతుందా? అన్న సంశయం వెంటాడుతున్నది. ఇప్పటికే ఉభయ జిల్లాలో సోయా పంట తీవ్రంగా దెబ్బతిన్నది. వరి కోతలకు సమయం ఆసన్నమవుతోన్న నేపథ్యంలో రుతుపవనాల తిరోగమన సమయం కాస్తా ఇబ్బందికరంగా మారుతున్నది.