నందిపేట్, నవంబర్ 5: ఆర్మూర్ నియోజకవర్గంలో వార్ వన్సైడ్ అని, కారు జోరుకుగా ఎదురు లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం డొంకేశ్వర్ మండలంలోని నికాల్పూర్, కోమట్పల్లి, అన్నారం, సిర్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డికి డప్పు వాయిధ్యాలు, మేళతాళాలతో, మహిళలు బోనాలతో వందలాది మంది యువకులు బైక్ ర్యాలీలతో ఘనస్వాగతం పలికారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాలతో తనకున్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు. వందలాది మంది వెంట రాగా జీవన్రెడ్డి ఇంటింటికీ వెళ్లి తిరిగి బీఆర్ఎస్కు ఓటేయాలని, మళ్లీ తనను గెలిపించాలని కోరారు. అనంతరం నిర్వహించిన సభల్లో జీవన్రెడ్డి మాట్లాడుతూ తాను పదేండ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధిని వివరించారు.
మరోసారి ప్రజల ఆశీస్సులు పొందడానికి వచ్చాననని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పల్లెప్రగతి, మన ఊరు – మన బడి, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని కులసంఘాలకు భవనాలన నిర్మాణం వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి నికాల్పూర్, కోమట్పల్లి, అన్నారం, సిర్పూర్ గ్రామాలకు వందలాది కోట్ల రూపాయల నిధులొచ్చాయని జీవన్రెడ్డి వెల్లడించారు. చేపట్టిన పనులు, పథకాల వారీగా ఖర్చు చేసిన వివరాలడ నివేదికలను ప్రజల ముందుంచారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేల భృతితోపాటు ఆసరా పింఛన్లు రూ.5 వేలకు, దివ్యాగుల పింఛన్లు రూ.6 వేలకు, రైతుబంధు రూ.16 వేలకు పెరుగుతాయన్నారు. అర్హులైన వారికి రూ.400లకే సిలిండర్, తెల్ల రేషన్ కార్డున్న వారికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రూ.5లక్షల చొప్పున వచ్చే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా అన్నారు. 62 ఏడ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీతో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు.
గ్రామాలు సీఎం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధికి నోచుకున్నాయని జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన సాధ్యమన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్ తెచ్చిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి బాట పట్టాయన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ రాజ్యం కేసీఆర్తోనే సాధ్యమవుతుందున్నారు. అభివృద్ధి అస్త్రంతో గెలుస్తానని, అరాచక శక్తులకు ఓడిస్తానని, ఆర్మూర్ ప్రజలు ఆత్మగౌరవ ప్రతీకలు, ప్రతి గుండెలో గులాబీ జెండా ఎగురుతోందని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా నిలిచి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఆర్మూర్, నవంబర్5: మండలంలోని ఫత్తేపూర్, సుర్భిర్యాల్ గ్రామాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి సతీమణి రజితారెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించారు. బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో, ఫత్తేపూర్, సుర్భిర్యాల్ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించాలని కోరారు.