మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య మహిళ’ పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఈ మూడు వారాల్లోనే వందలాదిమంది మహిళలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో లేడీ డాక్టర్లనే నియమించడంతో మహిళలు వారి సమస్యలను నిర్మోహమాటంగా తెలియజేస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చయ్యే వివిధ రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడం, మందులను అందించడంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
నమస్తే తెలంగాణ యంత్రాంగం : మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యపరీక్షలకు వెళ్లాలన్నా, చికిత్సలు చేయించుకోవాలన్నా భయాందోళనకు గురయ్యే సమయంలో ఈ పథకం ప్రవేశపెట్టడం మహిళల్లో ఆనందాన్ని నింపింది. ప్రతి మంగళవారం ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది ఆరోగ్య కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
మహిళలకు దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, ఇటీవలి కాలంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించే దిశగా అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, థైరాయిడ్, కడుపులో కంతి, గడ్డలు, యూరిన్ ఇన్ఫెక్షన్, హెచ్ఐవీ, కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్తో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహిళల పరీక్షలు నిర్వహించిన అనంతరం వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో పాటు వ్యాధిగ్రస్తుల రిపోర్టుల ఆధారంగా అందించే వైద్య చికిత్సల కోసం వైద్య సిబ్బంది వారిని పర్యవేక్షించే బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని 3వ వార్డు పరిధిలో గల హౌసింగ్బోర్డ్ కాలనీలోని ప్రాథమిక ఆర్యోగ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ఆరోగ్య మహిళ ’ పథకం ప్రారంభమైన మూడు వారాల వ్యవధిలో 150 మంది మహిళాలు వివిధ సమస్యలపై ఆరోగ్య కేంద్రానికి రాగా వైద్యులు పరీక్షలను నిర్వహించి మందులు అందజేసి సలహాలు సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రంలో ముఖ్యంగా ఆరోగ్య మహిళ పథకంలో భాగంగా 30 ఏండ్లు పైబడిన మహిళలను గుర్తించి మహిళల్లో వచ్చే మధుమోహం, రక్తపోటు, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్, నెలసరి, సంతాన సమస్యలు, కుటుంబ నియంత్రణ, లైంగిక సమస్యలు, అంటు వ్యాధులు, దమ్ము, అధిక రక్త స్రావం, అదేవిధంగా 45 సంవత్సరాల వయస్సు దాటిన మహిళల్లో కలిగే గర్భ సంబందిత వ్యాధులపై మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి పెద్ద దవాఖానకు పంపుతున్నారు. మద్నూర్ మండలం డోంగ్లీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఇప్పటి వరకు 300 మందికి పరీక్షలు నిర్వహించారు.
అన్ని పరీక్షలు జేసిండ్రు..
ఆర్మూర్, మార్చి 28 : కొన్ని నెలల సంది మస్తు దమ్ము అచ్చుడుతోటి మస్తు పరేషాన్ అయితుంది. ఆర్మూర్ల మా సుట్టాలింటికి అచ్చిన. మంగళారం ఆరోగ్య మహిళ పథకం కింద పరీక్షలు జేస్తున్నరని తెల్సుకొని అచ్చినా. డాక్టర్ మేడమ్కు నేను వడుతున్న తక్లీఫ్ గురించి జెప్పిన. అన్ని పరీక్షలు జేసిండ్రు. మందులు ఇచ్చిండ్రు. ఆడోళ్ల గురించి గతంల ఎవ్వళ్లూ గూడా పట్టించుకోలె. ఇంతటి మంచి పథకం సార్ట్ జేసిన కేసీఆర్కు దండాలు.
-అంకిత,అమీనాపూర్,వేల్పూర్ మండలం
దూరంపోవుడు బాధ తప్పింది..
మద్నూర్, మార్చి 28 : మా దవాఖానల అన్ని పరీక్షలు జేస్తుండ్రు. గతంల పరీక్షలు కోసం దెగ్లూర్, నిజాంబాద్ల ప్రైవేటు దవాఖానలకు పోయేటోళ్లం. ఈడ రూపాయి ఖర్సు లేకుండా మందులు కూడా ఇస్తుండ్రు. ఆడోళ్ల కోసం సర్కారోళ్లు గింత మంచి సౌలత్ జేసిండ్రు. దూరంపోవుడు బాధ తప్పింది. పైసల్ ఖర్సు కూడా అయితలేవు.
-చంద్రకళ, డోంగ్లీ
బహుత్ అచ్ఛా హై..
రుద్రూర్, మార్చి 28 : ఇస్సే పహలే.. గర్నమెంట్ దవాఖానకు జానా బోలేతో డర్ లగ్తాతా.. అబీ బహుత్ అచ్ఛా దేక్రే. హర్ హఫ్తా ఔరత్ లోగోంకో ముఫ్త్ మే టెస్టా కరే.. సీఎం సాబ్నే ఔరత్ లోగోంకే వాస్తే అచ్ఛా కామ్ కర్హ్రేహై. దవా బీ ఫ్రీమే దేరహేహై. ఏక్ పైసాబీ ఖర్చ్ నహీ హువా. మరద్ డాక్టర్ రహేతో హమ్ ఔరత్ లోగ్ తక్లీఫ్ బోల్ నహీ సక్తే. అబ్ డాక్టర్ లోగ్బీ ఔరత్ ఇచ్ హై. అబ్ హమారా తక్లీఫ్ ఉన్కో బోల్ సక్తే హై.
-అసియా బేగం, రుద్రూర్
మస్తు సౌలత్ జేసిండ్రు
చిన్న తక్లీఫ్ అచ్చినా డాక్టర్ దగ్గరికి అస్తున్నం. ఆశ మేడం సుక దవాఖానకు రావాలని చెప్తున్నది. గతంల ఇట్లా లేకుండే. మంగళారం దవాఖానలకు అచ్చి డాక్టర్ మేడమ్కు సూపెట్టుకుంటున్నాం. అన్ని పరీక్షలు జేసిండ్రు. ఆడోళ్లు చెప్పుకోని సమస్యలు ఉన్నా ఇప్పుడు డాక్టర్తో నిర్మొహమాటంగా చెప్పి తగు చికిత్స తీసుకునే అవకాశం కలిగింది.
-లక్ష్మి, రుద్రూర్
మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం హర్షణీయం
శక్కర్నగర్, మార్చి 28 : మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఉచిత వైద్య పరీక్షలతో పాటు, మందులు అందజేస్తూ చేపట్టిన చర్యలు ఎందరికో ఉపయోగకరంగా మారుతాయి. వేల రూపాయల ఖర్చుతో పరీక్షలు నిర్వహించే సమయంలో ఈ కార్యక్రమం వరంగా మారింది. ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి, వైద్యాధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు.
-మంజులవాణి, శ్రీవాణి జుంబ ఫిట్నెస్ సెంటర్, బోధన్
ముందస్తు పరీక్షలు చేయడం బాగుంది
నేటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడే అవసరం లేకుండా ముందస్తుగా అన్ని వ్యాధులను గుర్తించేందుకు వైద్యశాఖ పరంగా ఉచితంగా పరీక్షలు నిర్వహిచడం చాలా బాగుంది. ఆరోగ్య మహిళ పేరుతో ఈ పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులు అందజేయడం ఆనందంగా ఉంది. దవాఖానాల్లో వైద్య చికిత్సలు, పరీక్షలు అంటే డబ్బుతో కూడుకున్న సమయంలో ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించి, వారిలో భయాందోళనలు తొలగించేందుకు చేస్తున్న చర్యలు హర్షణీయం.
– స్వాతిరెడ్డి, బోధన్.
ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్య పరీక్షలు
రూపాయి ఖర్చులేకుండా అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం ఆనందంగా ఉంది. ఏదైనా జబ్బుకు గురైతే దవాఖానకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానలో ఈ కార్యక్రమం చేపట్టి, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్న వైద్యశాఖ అధికారులకు కృతజ్ఞతలు.కార్యక్రమం రూపొందించి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-మాధురి, బోధన్.
ప్రభుత్వ దవాఖానల్లో శ్రద్ధతో చికిత్సలు
మెండోరా, మార్చి 28 : ప్రభుత్వ దవాఖానకు వెళ్లగానే వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఎలాంటి శుభ్రత పాటించాలో వివరించారు. రక్తపరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో మహిళల గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడం ఆనందంగా ఉంది.
– అంకం శ్యామల, మెండోరా
గిన్ని టెస్టులు ఎన్నడూ సూడలే..
బీర్కూర్, మార్చి 28 : నా చిన్నప్పటి సంది గర్నమెంట్ దవాఖానలకు అస్తున్న. ఇన్ని రకాల టెస్టులైతే ఎన్నాడూ సూడలె. నాకు షుగర్ అచ్చిందని చెకప్ చేయించుకోని వచ్చిన. ఈడ ఆడోళ్లకు అన్ని టెస్టులు చేస్తున్నరు.. అవసరమైనోళ్లకు మందులు ఇస్తున్నరు. అవసరమైనోళ్లకు పెద్ద దవాఖానకు పంపుతుండ్రు. గింత సౌలత్ జేసిన సీఎం కేసీఆర్ సార్ సల్లంగుండాలె..
-ఇమామ్బీ, బీర్కూర్
రూపాయి ఖర్సులేకుండా జూసిండ్రు
15 ఏండ్ల సంది నాకు మోకాళ్ల నొప్పి ఉంది. మస్తు ప్రైవేట్ దవాఖాన్లకు తిరిగినా.. మస్తు పైసల్ ఖర్చు జేసినా.. అయినా తక్కలేదు. సీఎం సార్ ఆడోళ్ల కోసం కొత్తగా కార్యక్రమం షురూ జేసిండని తెల్సుకొని అచ్చినా… ఈడ లేడీ డాక్టరమ్మ మంచిగ జూసింది. టెస్టులు చేసింది. మందులు కూడా ఇచ్చింది. రూపాయి ఖర్సు లేకుంట మంచిగ జూసిండ్రు.
-డి. శంకరమ్మ, తిమ్మాపూర్