విద్యానగర్, జనవరి 11 : బీఆర్ఎస్ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణ శివారులోని ఓ ఫామ్హౌస్లో కామారెడ్డి, రాజంపేట్ మండలాలకు చెందిన పార్టీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీని గ్రామాలు, వార్డుల్లో విస్తృత పరిచేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం వివక్ష చూపుతున్నదని అన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, కామారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపీగౌడ్, మామిండ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.