బాన్సువాడ, ఫిబ్రవరి 20: బాన్సువాడ పట్టణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ వ్యాపార సంస్థలో జరిగిన గొడవ చినికిచినికి గాలివానలా మారి, ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పోలీసుస్టేషన్ వద్దకు తరలి వచ్చారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇరువైపులా వారు ఆరోపణలు చేసుకుంటుండగా, పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న డీఎస్పీ విఠల్రెడ్డి అక్కడకు చేరుకుని సర్దిచెప్పేందుకు యత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇరువర్గాలు బాహాబాహికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి ఝళిపించి, గుమిగూడిన వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.
మరోవైపు, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి బాన్సువాడకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. చుట్టుపక్కల దుకాణాలను మూసివేయించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. శనివారం బాన్సువాడ బంద్కు ఓ వర్గం వారు పిలుపునిచ్చారు.