దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు జిల్లా పోలీసు శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. నిఘా నీడలో ఈవెంట్స్ (రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్ వంటివి) నిర్వహించనుంది. ఇందుకోసం నిజామాబాద్ నగర శివారులోని రాజారాం స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు నేటి(గురువారం) నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ట్రయల్స్ను పరిశీలించిన పోలీసు కమిషనర్ నాగరాజు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 7: పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గురువారం నుంచి ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు హాజరుకానుండగా.. ఇందుకోసం నిజామాబాద్ నగర శివారులో ఉన్న రాజారాం స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5 నుంచి ప్రారంభంకానున్న ఈవెంట్స్ పూర్తిగా సీసీ కెమెరాల రికార్డింగ్ మధ్య నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను సీపీ నాగరాజు బుధవారం పరిశీలించారు. స్టేడియంలోకి ఎంట్రీ పాయింట్ మొదలు ఈవెంట్ ట్రయల్స్ను పరిశీలించారు.
సిబ్బందికి డ్యూటీ పాసులు, అభ్యర్థులకు ఎంట్రీ పాసులను ఏర్పాటు చేశారు. ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా కొనసాగుతుందని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తే మోసపోవద్దని సీపీ ఈ సందర్భంగా సూచించారు. ఈవెంట్స్ సందర్భంగా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రూల్స్ పాటించే క్రమంలో సిబ్బంది కఠినంగా ఉండాలని ఆదేశించారు. సీపీ వెంట డీసీపీ అరవింద్బాబు, అదనపు డీసీపీ గిరిరాజ్, ఏఆర్ ఏసీపీ ఎన్.సంతోష్, ఏవో రామారావు, మ్యాగ్నిటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్చార్జి మణికంఠ, ఎన్ఐబీ సీఐ ముఖీద్ పాషా, ఆర్ఐ అప్పలనాయుడు, సూపరింటెండెంట్ శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సంతోష్రెడ్డి, ఎస్సైలు నిశిత్, రాజేశ్వర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.