కేసీఆర్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనమన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం బాన్సువాడలో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో స్పీకర్ పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాజిరెడ్డి, బిగాల, హన్మంత్ షిండే, జాజాల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
బాన్సువాడ, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, డయాలసిస్ కేంద్రాలు, కంటివెలుగు పథకం వంటివి సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనమని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో బుధవారం వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్పీకర్ పాల్గొని ప్రజలకు అందిస్తున్న వైద్యం, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదల కోసమే సర్కారు దవాఖానలను అభివృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి చికిత్సలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానలను విస్తరించి, అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చి పేదలకు వైద్య సహాయం అందజేస్తుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్యారోగ్యశాఖకు రూ.11వేల కోట్లు కేటాయించారని తెలిపారు. నిమ్స్లో 2వేల బెడ్లను 4వేలకు విస్తరించేందుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని తెలిపారు. దేశంలో ఇదే అతిపెద్ద దవాఖాన కానుందన్నారు. వరంగల్లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో ఉన్నదని చెప్పారు. గతంలో మూడే డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు వాటిసంఖ్య ప్రభుత్వం 26కు పెంచిందన్నారు. 2014కు ముందు తెలంగాణ వ్యాప్తంగా సర్కారు దవాఖానలో 8వేల బెడ్లు ఉండేవని, ఇప్పుడవి 27,700కు చేరాయని తెలిపారు.
సిబ్బంది కృషితోనే ఎంసీహెచ్కు ఖ్యాతి..
బాన్సువాడకు రూ.20 కోట్ల నిధులు తెచ్చి వంద పడకల మాతాశిశు దవాఖాన నిర్మించామని, ప్రారంభించిన రెండేండ్లలోనే తల్లిపాల ప్రోత్సాహంలో జాతీయ అవార్డు వచ్చిందన్నారు. ఇదంతా వైద్యులు, సిబ్బంది కృషితోనే సాధ్యమైనట్లు కొనియాడారు. జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా వైద్యం కోసం బాన్సువాడకు వస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాలు నస్రుల్లాబాద్, చందూర్కు పీహెచ్సీలు మంజూరయ్యాయని, బాన్సువాడ పట్టణంలో రెండు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు. తాజాగా వర్నిలో 30 పడకలు, కోటగిరిలో 50 పడకలతో దవాఖానల నిర్మాణానికి శంకుస్థాపన బుధవారం శంకుస్థాన చేసినట్లు చెప్పారు.
ఏఎన్ఎంలకు బీపీ ఆపరేటర్ల అందజేత..
కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీఏంహెచ్వో లక్ష్మణ్సింగ్తో కలిసి వైద్యారోగ్య ప్రదర్శనశాలను స్పీకర్ ప్రారంభించారు. 362 మంది ఏఎన్ఎంలకు బీపీ ఆపరేటర్లను అందజేశారు. వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు ప్రభుత్వం తరఫున చీరలను పంపిణీ చేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు, స్టాఫ్ నర్సులు, దవాఖాన సూపరింటెండెంట్కు అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం పలువురు గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శిరీష, ఆర్డీవో రాజాగౌడ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హన్సు లీ, పీఆర్ ఈఈ సమత, బాన్సువాడ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసా ద్, ఎంపీపీ రఘు, మున్సిపాట్ కమిషనర్ రమే శ్, కౌన్సిలర్లు వై ద్యులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి సర్కారు కృషి
డిచ్పల్లి, జూన్ 14:వైద్య రంగంలో తెలంగాణ ప్రస్థానం దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయమని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం డిచ్పల్లి మండలంలోని ఎస్ఎల్జీ గార్డెన్లో వైద్యారోగ్య శాఖ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాకముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు… ప్రస్తుతం నేను వస్తా బిడ్డ సర్కారు దవాఖానకు అనే స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రూ.22కోట్ల విలువగల చెక్కులను అందజేశామని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం వైద్య సిబ్బంది వారి ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించారని కొనియాడారు. కరోనా సమయంలో అందించిన సేవలు ఎంత చెప్పినా తక్కువేనన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో మహిళలకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నదన్నారు.
కేసీఆర్ కిట్ నుంచి న్యూట్రిషన్ కిట్ల వరకు, డయాలసిస్ సెంటర్ల నుంచి డయాగ్నోస్టిక్ కేంద్రాల వరకు ప్రతి ఆలోచన ప్రతిష్టాత్మకమని, ప్రతి నిర్ణయం చారిత్రాత్మకమని ఆర్టీసీ చైర్మన్ కొనియాడారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు ఇలా అందరి వేతనాలను పెంచినట్లు వివరించారు. వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి డాక్టర్ కావాలన్న పేద విద్యార్థుల కలలను సాకారం చేశారన్నారు. ప్రజా సంక్షేమానికి సర్కారు కృషి చేస్తున్నదని, దవాఖానల్లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేశారన్నారు. అనంతరం పలువురు గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను, వైద్య సిబ్బందికి ప్రశంసపత్రాలను అందజేశారు. ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఆర్డీవో రవి, జిల్లా ఉప వైద్యాధికారి తుకారం రాథోడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాప్రెడ్డి, నాయకులు లక్ష్మీనర్సయ్య, డాక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామి
నిజాంసాగర్, జూన్ 14: తెలంగాణ వైద్యరంగం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ హయాంలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని, ఒక వైపు వైద్యవిద్య, మరోవైపు నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు చేరువగా తీసుకువచ్చారని అన్నారు. ప్రజలకు ఆరోగ్యభాగ్యాన్ని అందించడంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ పటిష్టం చేస్తున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ ఏది చేసినా ఓ చరిత్ర అవుతుందని, తొమ్మిదేండ్లలో వైద్యరంగంలో ఆదర్శంగా నిలిచామన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని, అందుకే అంగన్వాడీ కేంద్రాలు, వైద్యశాఖ ద్వారా న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నారని వివరించారు. సర్కారు దవాఖానలో ప్రసవం చేయించుకున్న వారికి ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే 12వేలు అందిస్తున్నారని వెల్లడించారు. మహిళల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. మాతాశిశు మరణాలు మన రాష్ట్రంలో చాలా వరకు తగ్గాయని, ప్రభుత్వానికి సహకరిస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది చాలా కష్టపడి సేవలు అందించారని, ప్రభుత్వ ముందస్తు చర్యలతో కరోనా ప్రమాదం నుంచి చాలా వరకు తప్పించుకున్నామని, ఇతర దేశాలు సైతం సీఎం కేసీఆర్ను ప్రశంసించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, ఎంపీ బీబీ పాటిల్ చొరవతో జుక్కల్లో రూర్బన్ పథకం కింద రూ.5.50కోట్లతో దవాఖాన భవనాన్ని నిర్మించుకున్నామని అన్నారు. బిచ్కుందలో దవాఖాన భవనం, డయాలసిస్ కేంద్రం, పిట్లంలో దవాఖాన భవన నిర్మాణ పనులు ప్రారంభించామని, రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దేశానికే ఆదర్శం తెలంగాణ..
దేశానికే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగం ఆదర్శంగా నిలుస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ అన్నారు. కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ కంటి చూపును ప్రసాదించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని వివరించారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం పొందిన వారికి సైతం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
అనంతరం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, ఏఎన్ఎం, స్టాఫ్నర్సులు, ఆశ వర్కర్లు, సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో చేపడుతున్న మార్పులు, గర్భిణులు, బాలింతల కోసం తీసుకువచ్చిన పథకాలకు సంబంధించిన వీడియోను చూయించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఎంపీపీ యశోదానీలుపటేల్, సొసైటీ చైర్మన్ శివానంద్, సర్పంచ్ రాములు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి ఆదర్శం.. తెలంగాణ వైద్యరంగం
వైద్యారోగ్య దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల
ఖలీల్వాడి, జూన్ 14: సీఎం కేసీఆర్ సారథ్యంలో వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు బిగాల గణేశ్ గుప్తా అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో ఎమ్మెల్యే బిగాల పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి, ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తే రూ.12 వేలు, ఆరోగ్యలక్ష్మి పథకాలతోపాటు వైద్యసిబ్బంది కృషితో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ప్రభుత్వ దవాఖానలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చి ప్రైవేట్ దవాఖానలకు ధీటుగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని, ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవాలు పెరిగాయని, గర్భిణులకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడంతో మాతా శిశు మరణాలు తగ్గాయన్నాని వివరించారు.
తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా సాధారణ దవాఖానల్లో 60 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి మంగళవారం ఆరోగ్యమహిళ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టామని, భవిష్యత్తులో అన్ని దవాఖానల్లో ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో వైద్య ఆరోగ్య సిబ్బంది విశేష సేవలందించారని కొనియాడారు. అనంతరం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, ప్రభుత్వ దవాఖాన పర్యవేక్షకురాలు డాక్టర్ ప్రతిమారాజ్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
నాగిరెడ్డిపేట్, జూన్ 14: ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేశారని, ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎల్లారెడ్డి శాసనసభ్యుడు జాజాల సురేందర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారతండాలో బుధవారం వైద్యారోగ్య దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జాజాల హాజరై మాట్లాడారు. మహిళలు గర్భం దాల్చడం నుంచి ప్రసవం అయ్యేంత వరకు అన్ని రకాల సేవలను వైద్య సిబ్బంది అందిస్తున్నారన్నారు. బిడ్డ భూమి మీదకు రాకముందే ఆరోగ్యవంతంగా జన్మించాలనే ఉద్దేశంతో ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి, న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ అందించి పిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ దవాఖానలో 30 శాతం మంది మాత్రమే ప్రసవాలు చేసుకునే వారని, ప్రస్తుతం 70 శాతం మంది ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారని వెల్లడించారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 33జిల్లాల్లో 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో విద్యా, వైద్య పరంగా అభివృద్ధి సాధించామన్నారు. అనంతరం వైద్య రంగంలో సేవలు అందించిన వారికి ప్రత్యేక కిట్లు, ప్రశంసపత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజదాస్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీనారాయణ, తహసీల్దార్ సయీద్ అహ్మద్, ఎంపీడీవో రఘు, గోపాల్పేట్ సర్పంచ్ వంజరి సునీత, తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోతె శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణ, బీఆర్ఎప్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య, సర్పంచులు కిచ్చగారి సునీతారెడ్డి, శ్రీధర్గౌడ్, ప్రవీణ్, శ్రీనివాస్, విజితారెడ్డి, సాయిలు, ఎంపీటీసీ వినితారెడ్డి, నారాయణ, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం
ఆర్మూర్, జూన్14: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రజలకు అందుతున్నదని ఆర్మూర్ శాసనసభ్యుడు, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ వంద పడకల దవాఖానలో నియోజకవర్గస్థాయి వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే జీవన్రెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు బతుకమ్మలు ఎత్తుకొని సభ వేదిక వరకు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం అధోగతి పాలు కాగా స్వరాష్ట్రంలో అత్యాధునిక హంగులతో పురోగమిస్తూ కార్పొరేట్ స్థాయిని మించిన వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. నాడు ప్రజారోగ్యం ఛిద్రమని, స్వరాష్ట్రంలో భద్రమన్నారు. తెలంగాణలో వైద్య విప్లవానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బలోపేతం చేశారన్నారు.
తల్లీబిడ్డల సంరక్షణకు 14రకాల వస్తువులతో ఇస్తున్న కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అని జీవన్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 30శాతం ఉన్న ప్రసవాలు.. గత ఏప్రిల్ నాటికి 70శాతానికి చేరుకున్నాయన్నారు. బస్తీ దవాఖానల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో మూడు వేలకు పైగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తుండడం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. స్వరాష్ట్రంలో మొట్టమొదటి వంద పడకల దవాఖాన ఆర్మూర్కే ఇచ్చి రూ.27కోట్లు మం జూరు చేసిన దేవుడు కేసీఆర్ అని, ఈ ద వాఖానలో ఇప్పటి వరకు 25వేల ఉచిత ప్రసవాలు జరిగాయన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్ మాట్లాడుతూ ప్రభు త్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. అనంతరం గర్భిణులకు న్యూట్రిషన్, బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, జడ్పీ సీఈవో గోవింద్, దవాఖాన సూపరింటెండెంట్ నాగరాజు, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితాపవన్, వైస్ చైర్మన్ మున్నా, ఆర్మూర్, మాక్లూర్ ఎంపీపీలు పస్క నర్సయ్య, మాస్త ప్రభాకర్, చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మధుశేఖర్, వైద్యులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట
కామారెడ్డి,జూన్ 14 : వైద్యఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకె.ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డిలోని కళాభారతిలో బుధవారం నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని తెలిపారు. ప్రతి ఏడాది పేదల సంక్షేమానికి రూ.50 వేల కోట్లు ఖర్చుపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నదని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో అదనంగా మరిన్ని దవాఖానలు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అంతకుముందు గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హఫీజ్, ప్రభుత్వ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.