వేల్పూర్ ,ఆగస్టు 10: పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన శాడిస్ట్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను గ్రామాల్లో ఎక్కడికక్కడ యువత నిలదీయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలిపారని పేర్కొన్నారు. గురువారం ఆయన వేల్పూర్ మండలం లక్కోర ఏఎన్జీ ఫంక్షన్ హాలులో బాల్కొండ నియోజకవర్గంలోని యవతకు ఉచిత లర్నింగ్ లైసెన్స్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 50 ఏండ్ల కాలంలో 33వేల డ్రైవింగ్ లైసెన్స్లు ఉంటే నేడు పది రోజుల్లో 10, 400 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇవి పూర్తి చేయాలంటే ఆరునెలలకుపైగా సమయం పడుతుందని అధికారులు అంటే రోజుకు 250 దరఖాస్తులు పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కేవలం ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే జరిగిందన్నారు. యువత ప్రస్తుత పరిస్థితులపై ఆలోచన చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని మంత్రి యువకులకు వివరించారు. నాడు అంధకారంలో ఉన్న తెలంగాణ నేడు వెలుగు జిలుగులతో విరాజిల్లుతోందన్నారు. ఎండాకాలంలో డే టైంలో కూడా కరెంట్ ఉండేది కాదని,వ్యవసాయానికి ఆరు గంటలు చాలీచాలని కరెంట్ ఇచ్చేవారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో కరెంట్,సాగు నీరు ఇవ్వడంతో నాడు బీడు వడ్డ భూములు..నేడు పచ్చని పైరులతో కళకళ లాడుతున్నాయన్నారు.దీని వెనుక కేసీఆర్ శ్రమ ఎంతో ఉందన్నారు. వరల్డ్ లార్జెస్ట్ మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏది అని గూగుల్లో సెర్చ్ చేయాలని సూచించారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ మంత్రికి వారు ఈ సందర్భంగా వారు సమాధానం ఇచ్చారు. మనల్ని తెల్లారితే విమర్శించే బీజేపీ నాయకులు, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు నిర్మించుకోలేదని ప్రశ్నించారు. నాడు ఎట్లున్న తెలంగాణ..నేడు ఎట్లయ్యిందని, ఇది కేసీఆర్ చేసిన అభివృద్ధి కాదా అని తెలిపారు. మంత్రి కేటీఆర్ కృషితో వేల పరిశ్రమలు రాష్ర్టానికి వచ్చాయన్నారు. లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని తెలిపారు. తెలంగాణకు ఏమీ చెయ్యనోడు కూడా ఇయ్యాల ఎగిరెగిరి మాట్లాడుతున్నాడని విమర్శించారు. రాత్రి పూట 3గంటలు, పొద్దున 3గంటలు ఎటూచాలని కరెంట్తో రైతులు మళ్లీ గోస పడాల్నా అని ప్రశ్నించారు.
పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన అర్వింద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవితతోపాటు తనపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సంస్కారం లేకుండా మాట్లాడుతున్న ఒక శాడిస్ట్ ఎంపీ అర్వింద్ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. పని చేస్తున్న వారిని తిట్టే అర్వింద్కు యువతే బుద్ధ్ది చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. మీ ఊర్లోకి వస్తే నువ్వు మాట ఇచ్చిన పసుపు బోర్డు ఏది అని నిలదీయాలన్నారు. బీజేపీ అంటేనే అబద్ధాలు అని, యువత చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86వేల కోట్లు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని పచ్చి అబద్ధాలు మాట్లాడారని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మోదీ ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు.
నియోజకవర్గ ప్రజలే తన కుటుంబం అని, వారి ఏది కావాలన్నా చేస్తానన్నారు.ప్రజలకు ఏది అవసరమో అది చేసుకుంటూ పోవడమే తన పని అని మంత్రి మరోమారు స్పష్టం చేశారు. పని చేస్తున్న వారికి అడ్డుపడుతున్న వారెవరో ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటరమణ, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోటపాటి నర్సింహానాయుడు, డాక్టర్ మధు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.