పేగుబంధం ‘కాలిపోయింది’. మానవత్వం ‘మంట’గలిసింది. ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసిన తండ్రిని ఆప్యాయంగా చూసుకోవాల్సిన కూతుళ్లు దారుణానికి ఒడిగట్టారు. ఆస్తి ఇవ్వట్లేదని ఇంట్లో బంధించి నిప్పుపెట్టారు! రాజంపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిందీ దారుణం. కడుపున పుట్టిన వారే కన్నతండ్రిని అంతమొందించారని బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మరోవైపు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
రాజంపేట్, మార్చి 13: ఆస్తి కోసం దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. కన్న వారిని సైతం కడ తేరుస్తున్నారు. ముదిమి వయస్సులో ఆలనా, పాలనా చూసుకోవాల్సింది పోయి వారితో కర్కషంగా వ్యవహరిస్తున్నారు. ఆస్తి ఇవ్వకుంటే ఏకంగా మట్టుపెడుతున్నారు. భూమి కోసం కూతుళ్లే తండ్రిని సజీవ దహనం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
బంధువులు, స్థానికుల కథనం మేరకు.. రాజంపేట్కు చెందిన కొప్పుల ఆంజనేయులు (70)కు భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేసి పంపించేశాడు. గ్రామంలో ఉన్న నాలుగెకరాల భూమి కోసం కుటుంబంలో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరు కూతుళ్లు రాజంపేట్కు వచ్చి ఇక్కడే నివాసముంటున్నారు. ఆస్తి కోసం కూతుళ్లు సతాయిస్తుండడంతో ఆంజనేయులు కుమారుడు కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు, భార్య, బిడ్డలు సరిగ్గా చూసుకోక పోవడంతో ఆంజనేయులు రెండో పెండ్లి చేసుకున్నారు. ఆమెతో కలిసి తన సొంతిల్లు సమీపంలోని మరోచిన్న ఇంట్లో ఉంటున్నాడు.
చిన్న కూతురు బిడ్డ పెండ్లి విందు ఆదివారం కామారెడ్డిలో జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు ఇద్దరు కూతుళ్లు కలిసి తండ్రిని ఇంట్లో ఉంచి బయట తాళం వేసి వెళ్లిపోయారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఇంట్లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. హుటాహుటిన జేసీబీని తెప్పించి ఇంటిని కూల్చేసి, మాంసపు ముద్దగా మారిన మృతదేహాన్ని కామారెడ్డి దవాఖానకు తరలించారు.
అయితే, తండ్రిని కూతుళ్లే చంపి దహనం చేశారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉదయమే తండ్రిని చంపేసి, తాళం వేసి వెళ్లారని, రాత్రి వచ్చాక పథకం ప్రకారమే ఇంటిని కాల్చేశారని చెబుతున్నారు. మరోవైపు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే జేసీబీని తీసుకొచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు, కుల పెద్దలు, గ్రామస్తులు సోమవారం ఉదయం ఆందోళన చేపట్టారు. అక్కడకు వచ్చిన సీఐ తిరుపతయ్యతో వారు వాగ్వాదానికి దిగారు. తల, మొండెం వేరుపడి ఉన్నప్పటికీ ఎలాంటి ఆధారాలు సేకరించకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారని ప్రశ్నించారు. సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అయితే, పంచనామా తప్పుగా రాస్తున్నారని మధ్యాహ్నం సమయంలో మరోసారి ఆందోళనకు దిగారు. ఆంజనేయులు అన్న కుమారుడు పెద్ద స్వామి ఇచ్చిన పిటిషన్కు, పంచనామా రాయడంలో తేడా ఉన్నదని, పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని స్థానికులు రాస్తారోకో చేశారు. సీఐ ఎంత సర్దిచెప్పినా ఆందోళన విరమించలేదు. దీంతో డీఎస్పీ సురేశ్బాబు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల వ్యవహార శైలిపైనా విచారణ జరిపిస్తామని చెప్పడంతో కుల పెద్దలు, బంధువులు ఆందోళన విరమించి, అంత్యక్రియలు పూర్తి చేశారు.