లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో గందరగళం నెలకొన్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిత్వం ఖరారుపై అంతులేని సందిగ్ధత కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతుండగా, హస్తం గుర్తుపై పోటీ చేసేదెవరో తేల్చకుండా అధికార పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, క్యాండిడేట్లు లేక విలవిల్లాడుతున్నది. జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నా.. ఆ పార్టీ నాయకత్వం ఎటూ తేల్చకుండా నాన్చుతున్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడమే కాదు.. క్షేత్ర స్థాయిలో ప్రచారంతో హోరెత్తిస్తున్నది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తుండడంపై హస్తం పార్టీ కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల మాదిరిగా తెర వెనుక బీజేపీకి సపోర్టు చేసే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్లో బీజేపీ గెలుపు వెనుక హస్తం సపోర్టు ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కూడా అదే ఒరవడిని కాంగ్రెస్ నడుస్తున్నదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడి పది రోజులవుతున్నా రాజకీయ పార్టీల సందడి అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. అధికార పార్టీలో అంతా స్తబ్ధుగానే ఉండగా, ‘కారు’ జోరుగా దూసుకెళ్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ లోక్సభ ఎలక్షన్లలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా గులాబీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. బీజేపీ, కాంగ్రెస్లకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రణాళికలను రచిస్తున్నది. షెడ్యూల్ రాక ముందే జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్కుమార్ను, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఆ ఇద్దరు నేతలు ఇప్పటికే కదనరంగంలో అడుగు పెట్టారు. మరోవైపు, నిజామాబాద్ లోక్సభకు కనీసం అభ్యర్థిని ప్రకటించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నది. ఢిల్లీ పెద్దలతో మాట్లాడేందుకు రేవంత్రెడ్డి పలుమార్లు వెళ్లినా కొలిక్కి రాలేదు. పోటీకి ముందుకొచ్చిన మానాల మోహన్రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేశ్రెడ్డిలకు కార్పొరేషన్ పదవుల ఆశను చూపి వారిని పక్కకు జరిపారు. పార్టీ తరఫున అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో జాప్యం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, బీజేపీ అభ్యర్థిగా అర్వింద్ పేరును ఖరారు చేశాక పార్టీలో అసంతృప్తి రెట్టింపయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్వింద్ గెలుపు కోసం పని చేసేదే లేదంటూ బీజేపీ నేతలే బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. జహీరాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులైతే పత్తా లేకుండా పోయారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, గాలి అనిల్కుమార్ ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొని పోతూ వారి సలహాలు, సూచనలను తీసుకుంటున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలను సముదాయించుకుంటూ సమన్యవంతో ముందుకు సాగుతున్నారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండడంతో ఆయా చోట్ల మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు, పార్టీ అభ్యర్థుల తరఫున కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో పాటుగా బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటుగా కరెంట్ కటకట, సాగునీటి కొరత, పంట పొలాలకు దక్కని భరోసా, రుణమాఫీ హామీపై కాంగ్రెస్ పార్టీ దాటవేత, బోనస్ హామీపై బోగస్ ప్రకటనలను అస్ర్తాలుగా మలచుకుని కాంగ్రెస్, బీజేపీల తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. నిజామాబాద్ లోక్సభ సీటును కైవసం చేసుకోవడం, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నది.