కామారెడ్డి,డిసెంబర్ 10 : సీఎం రేవంత్రెడ్డి బయటి కలుపుమొక్కల కన్నా ఇంట్లో ఉన్న కలుపు మొక్కలపై ముందు దృష్టి సారించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ శాఖలో జరిగిన రూ.80 వేల కోట్ల అవినీతి గురించి చర్చ జరుగుతుందని అన్నారు. ఈ స్కాం ఈ నాలుగేండ్లలో జరిగింది కాదని అన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జరిగిందని.. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండవచ్చని ఆరోపించారు. ఈ స్కాం విద్యుత్ శాఖ సీఎండీ ప్రభాకర్ రావు, అధికారులు చేసినది కాదని అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో నాయక్ అనే విద్యుత్ శాఖ ఉద్యోగి 18 సంవత్సరాలుగా పని చేస్తున్నాడని అతని జీతం నెలకు రూ. లక్షన్నర వరకు ఉంటుందని, షబాజ్ అనే మైనార్టీ శాఖ ఉద్యోగి 15 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ ఇంట్లో పని చేస్తున్నారని అతని జీతం కూడా రూ. లక్ష వరకు ఉంటుందని అన్నారు.
7 సార్లు ఎమ్మెల్యేగా ఓడిన షబ్బీర్ ఇంట్లో ఏ హోదాతో వీరు పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ లెక్కన వీళ్ల జీతాల ద్వారా ఇప్పటికే రూ. 2 కోట్లకు పైగా ప్రజాధనం వృథా చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి, మాణిక్ ఠాకూర్.. షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఉద్యోగులు కనబడలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఇకనైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు. ఏడు సార్లు ఓడిపోయిన వ్యక్తి మంత్రి పదవి కోసం సీఎం చుట్టూ తిరుగుతున్నాడని అన్నారు. సీఎం సమయమిస్తే స్వయంగా కలిసి వివరాలు అందిస్తానని తెలిపారు. సీఎం హోదాలో మాజీ సీఎం కేసీఆర్ను దవాఖా నలో కలవడం హర్షణీయమని అన్నారు. తాను కూడా త్వరలో కేసీఆర్ను పరామర్శిస్తానని అన్నా రు. సమావేశంలో కౌన్సిలర్ మోత్కురి శ్రీకాంత్, బీజేపీ నాయకులు తేలు శ్రీను, భరత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.