సదాశివనగర్, సెప్టెంబర్ 15 : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతిచెందింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండలం దగ్గి, చాంద్రాయాన్పల్లి అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై దర్గా వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో చిరుత తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని కామారెడ్డి జిల్లా కార్యాలయానికి తరలించారు. వన్యప్రాణులకు హాని తలపెట్టకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. రోడ్లపై అటవీ జంతువులు కనిపిస్తే వెంటనే వాహనాలను నిలిపివేసి, అవి రోడ్డు దాటాక వెళ్లాలని సూచించారు.