శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. బుధవారం నిర్వహించే సీతారాముల కల్యాణానికి దేవాలయాలను విద్యుద్దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొబ్బరి ఆకులతో కల్యాణమండపాలు, చలువ పందిళ్లు వేశారు. ఖిల్లా, డిచ్పల్లి, సుభాష్నగర్ రామాలయాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రఖ్యాత రామాలయాలపై ప్రత్యేక కథనం…
బోధన్, ఏప్రిల్ 16 : ఉమ్మడి జిల్లావాసులకు ఠక్కున గుర్తొచ్చే రామాలయాల్లో బోధన్ పట్ట ణం శక్కర్నగర్లోని శ్రీ కోదండ రామాలయం ఒకటి. నిజాంషుగర్స్ యాజమాన్యం ఈ రా మాలయాన్ని నిర్మించింది. 1951 నవంబర్ 8న బ్రహ్మర్షి, వేద పండితులు దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఈ రామాలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయుడి పాలరాతి విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. భద్రాద్రిలో మాదిరిగానే ఇక్కడ కూడా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తుండడం విశేషం. భద్రాద్రిలోని రామాలయం మాదిరిగానే శక్కర్నగర్ రామాలయంలో విగ్రహాలు పశ్చిమాభిముఖంలో ఉంటాయి.
– ఏండ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతి
గాంధారి, ఏప్రిల్ 16: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారంలో 500 ఏండ్ల చరిత్ర కలిగిన శ్రీరామంజనేయ స్వామి ఆలయం నెలకొన్నది. ఇక్కడి ఆలయంలో వందల ఏండ్ల నుంచి అఖండ జ్యోతి వెలుగుతూనే ఉన్నది. ఈ ఆలయం పూర్తిగా రాతి స్తంభాలతో ఆకర్షణీయంగా నిర్మించారు. ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహ హృదయంలో సీతారామలక్ష్మణులు ఉంటారు.
సారంగాపూర్, ఏప్రిల్ 16 : ఉమ్మడి జిల్లాల్లోనే పేరుగాంచిన మాధవ్నగర్ సాయిబాబా ఆలయం వేడుకలకు ముస్తాబైంది. శ్రీరామ నవమి, సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒకేరోజు రెండు వేడుకలు ఉండడంతో 20 వేలకు పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీరాం రవీందర్గుప్తా తెలిపారు.
రెంజల్, ఏప్రిల్ 16: కందకుర్తి సమీపాన త్రివేణి సంగమక్షేత్రాన్ని అనుకొని ఉన్న రామాలయానికి మూడు వందల ఏండ్లకు పైగా చరిత్ర ఉన్నది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు త్రేతాయుగంలో దండకారణ్యంలోని గౌతమీనదీ, మంజీరానది తీరం నుంచి కాలినడకన గోదావరి గుండా వెళ్తూ కందకుర్తిలో బస చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ఈ రామాలయాన్ని ఛత్రపతి శివాజీ దర్శించుకున్నారు.