డిచ్పల్లి, ఫిబ్రవరి 1: మండలంలోని చారిత్రక డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకుడు సుమిత్ శర్మ దేశ్పాండే అధ్వర్యలో తొలిరోజు మాఘశుద్ధ ఏకాదశి రాత్రి 7గంటలకు పుణ్యాహవాచనం, అంకురార్పణం, ముత్సంగ్రహణం, అఖండ దీపారాధన, రక్షాబంధనం, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు కొనసాగాయి.
కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రాందాస్గుప్తా, ఆలయకమిటీ చైర్మన్ పొద్దుటూరి మహేందర్రెడ్డి, సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి, విండో చైర్మన్ జైపాల్, ఉపసర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ మానసాసాయి, వీడీసీ కోశాధికారి నర్సయ్య, బక్కన్న, సాగర్, ఆలయ కమిటీ సభ్యులు వినోద్, నిర్మల, జయసుధ, పంచాయతీ కార్యదర్శి వినయ్, భక్తులు పాల్గొన్నారు.