నిజామాబాద్ క్రైం/రెంజల్/నవీపేట/శక్కర్నగర్, ఆగస్టు 23: ముస్లిముల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఎంఐఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం ఆందోళన చేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు నగరంలోని నెహ్రూపార్క్ వద్ద రాస్తారోకో చేసి రాజాసింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సున్నీ ఉల్మా కౌన్సిల్, మిలాద్ కమిటీ, ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సీపీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు అలీబాగ్బన్, ముఖీమ్, ముస్తాసిన్, రఫీ, మిర్జా అఫ్సర్ బేగ్, అబ్దుల్ అలీ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాసింగ్పై 153-ఏ, 295 ఏ, 504, 505(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్హెచ్వో విజయ్బాబు తెలిపారు.
జమియాతే ఉల్మా ఆధ్వర్యంలో రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలోని తెలంగాణ చౌరస్తాలో రాజా సింగ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం రెంజల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నవీపేట మం డల కేంద్రంలో ఎంఐఎం నాయకులు రాస్తారోకో నిర్వ హించారు.
రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సై రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను వెంటనే అరెస్టు చేయాలని ఎంఐఎం, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల నాయకులు డిమాండ్చేశారు. ఈ మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్కు ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ మతాలపై మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడు ముషీర్ బాబా, కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు తలారీ నవీన్, నాయకులు బడు, కలీం, కౌన్సిలర్ ఇమ్రాన్, ఆమ్ఆద్మీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి జునైద్ అహ్మద్తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.