నందిపేట్, డిసెంబర్1: చరిత్రలోనే ఎన్నడూ లేనంత ప్రగతి పనులు సీఎం కేసీఆర్ సహకారంతో కొనసాగుతున్నాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఆర్మూర్ పట్టణంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
సంక్షేమ పథకాలు, పింఛన్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇండ్లపై నుంచి ఉన్న విద్యుత్ లైన్లు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని స్థానికులకు భరోసా ఇచ్చారు. రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను వేరే చోటుకు మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. పెర్కిట్ చెరువు, రెడ్డి చెరువుల్లో వెంటనే కాలుష్య నివారణ చర్యలు చేపడుతామన్నారు. అధికారులు బాద్గుణ, తల్వేద, పెర్కిట్ తదితర ప్రాంతాల్లో 1500 ఇండ్ల స్థలాలను గుర్తించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, వారికి రూ.3 లక్షల చొప్పున మంజూరు చేయించి ఇండ్ల నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే చెప్పారు.
మోడ్రన్ ధోబీఘాట్, గూండ్ల చెరువు, టూరిజం అభివృద్ధి పనులు, వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల మంజూరు తదితర అంశాలపై మంత్రి కేటీఆర్, కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. టీచర్స్ కాలనీలో తమ కులసంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని, తమ కాలనీలో ప్రమాదకరంగా మారిన కరెంట్ స్తంభాలను తొలగించాలని వడ్డెర కుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆర్మూర్ పట్టణ ప్రగతిపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు.
పట్టణంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో రూ.23.75 కోట్ల మంజూరుకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని, ఈ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఆర్మూర్ టూరిజం అభివృద్ధిలో భాగంగా 365 రోజులూ నీళ్లు ఉండే గూండ్ల చెరువును అభివృద్ధి చేస్తామని అన్నారు. రూ.రెండు కోట్ల వ్యయంతో ఐలాండ్ నిర్మాణంతో పాటు బోటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నిధుల్లో రూ.కోటి పర్యాటక శాఖ భరిస్తుందని, మిగిలిన రూ.కోటి తాను సమకూరుస్తున్నానని వెల్లడించారు.
పట్టణంలో మిగిలి ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో అంగడిబజార్లోని రైతుబజార్లో 72 షాపుల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. ఈ రైతుబజారులో మరో 30 నుంచి 40 షాపుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. ‘నమస్తే నవనాథపురం’లో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్చైర్మన్ షేక్ మున్నా, అన్ని వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.