బోధన్, డిసెంబర్ 10 : బోధన్ పట్టణంలోని సాంఘిక, సంక్షేమ బాలుర వసతి గృహం ప్రారంభించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వసతిగృహం సంక్షేమ అధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుక ఏండ్ల క్రితం వసతిగృహంలో చదువుకొని, పలు ఉన్నత ఉద్యోగాలు చేసి విశ్రాంత ఉద్యోగులుగా మారినా, ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పూర్వ విద్యార్థులకు వేదికగా మారింది. 1972లో ప్రారంభించిన ఈ వసతిగృహం 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించాలని ఆలోచన చేయడం.. కొందరు పూర్వ విద్యార్థులు కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించడంతో ప్రస్తుతం డెయిరీ టెక్నాలజీ విభాగం హైదరాబాద్లో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మోహన్ మురళీ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా పూర్వ విద్యార్థులకు ఈ వేదిక ఆత్మీయస్వాగతం పలికింది.
ఈ సందర్భంగా వారు ఈ వసతిగృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేసిన తీరు, ప్రస్తుతం ఎవరేం చేస్తున్నారనే అంశాలపై ఆత్మీయంగా వివరించుకున్నా రు. తమతో వసతిగృహంలో ఉంటూ మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సరదాగా, సంతోషంగా ఈ ఆత్మీయసమ్మేళనాన్ని కొనసాగించారు. ఏండ్ల గడిచినా స్నేహాన్ని మరిచిపోకుండా వారు చెప్పుకున్న అంశాలు గత స్మృతులను గుర్తుచేశాయి. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సాగ కైలాసం, ఎం.నర్సయ్య, అద్దంకి హుసాన్, రాములు, లింగన్న, సత్యసారథి, అమృత్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.