సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్రామీణ విద్యార్థుల్లో ఆవిష్కరణలపై విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన 500 మంది విద్యార్థులతో స్టార్టప్ టూర్ను నిర్వహించారు. శనివారం టీ హబ్ను సందర్శించి, అక్కడ ఉన్న స్టార్టప్ల నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలకు ఉన్న ప్రాముఖ్యతను రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి, అధ్యాపకులకు తెలిసేలా చేసేందుకు టీటా స్టార్టప్ టూర్ను మొదటిసారిగా నిర్వహించారు. విద్యార్థి దశలోనే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ యువ వ్యాపార వేత్తలుగా మారే అవకాశాన్ని తెలియజేప్పేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్కుమార్ తెలిపారు. డిజిథాన్ పేరుతో వందలాది గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యపై అవగాహన కల్పించామని తెలిపారు. 10 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో పాటు అధ్యాపకులు టీ హబ్లోని స్టార్టప్ల నిర్వాహకులతో మాట్లాడించేలా ఏర్పాట్లు చేశామన్నారు. స్టార్టప్ టూర్లో పాల్గొన్న 500 మంది వివిధ కాలేజీల విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న మరో స్టార్టప్ టూర్కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
టీహబ్ సందర్శనలో భాగంగా స్టార్టప్ అంటే ఏంటి? ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రయోజనాలు ఎలా ఉంటాయి. కంపెనీ ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆవశ్యకత, ఆవిషరణల ఆలోచనలను ఎలా ముందుకు తీసుకుపోవాలి? ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు వంటి వివిధ అంశాల పై ఎంట్రప్రెన్యూర్లతో విద్యార్థులు, అధ్యాపకులు చర్చించారు. తమ సందేహాలను నివృత్తి చేసుకొని ఆవిష్కరణలతో ఉన్న ప్రయోజనాలు తెలుసుకున్నారు. ఈ బృందంలో కిట్స్ (ఖమ్మం), కిట్స్ (వరంగల్ ), జేపీఎన్సీ (మహబూబ్నగర్), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సంగారెడ్డి), మల్లారెడ్డి యూనివ ర్సిటీ (మేడ్చల్) ,నల్ల నర్సింహారెడ్డి (మేడ్చల్), బీవీఆర్ఐటీ (మెదక్) కళాశాలల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు స్టార్టప్ల నిర్వాహకులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.