బీబీపేట్, డిసెంబర్ 17: మండల కేంద్రంలోని పెద్ద చెరువు పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. ఆనవాళ్లు కోల్పోయిన చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా పూర్వవైభవం తీసుకొచ్చింది. దీంతో 27 సంవత్సరాల తర్వాత ఏడు గ్రామాల్లోని పంటల కోసం శనివారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయలో భాగంగా చెరువును పునరుద్దరించడం.. సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెద్ద చెరువు అలుగుపారిందన్నారు. రైతుల కోరిక మేరకు యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నా రు.
అంతేకాకుండా కాళేశ్వరం నీటితో ఈ చెరువు ఎల్లప్పుడు నిండు కుండలా ఉండేలా కృషి చేస్తాన న్నారు. అనంతరం మన ఊరు-మన బడి పథకంలో భాగంగా రూ.1.35 కోట్లతో నిర్మించనున్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భవనానికి విప్ భూమి పూజ చేశారు. అలాగే రూ.12 లక్షలతో నిర్మించిన బతుకమ్మ ఘాట్, రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, రూ.11.50 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం, రూ.8 లక్షలతో నిర్మించిన మైనారిటీ భవనాన్ని విప్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, ఎంపీపీ బాలామణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ, ఎంపీటీసీలు, పల్లవి, నీరజ, ఉపసర్పంచ్ సాయినాథ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్గౌడ్, రైతుబంధు కన్వీనర్ నాగరాజ్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వం చె రువులు, కుంటలను అభివృద్ధి చేయడంతో పూర్వవైభవం సంతరించుకున్నాయి. గతంలో చెరువులో నీరు నిల్వ లేకపోవడంతో పంటలు సరిగా పండేవి కావు. ప్రస్తుతం చెరువులో పుష్కలంగా నీరు ఉండడంతో 27 సంవత్సరాల తర్వాత యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉంది.
-కుర్ల సిద్ధిరాములు, రైతు, బీబీపేట్
సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుకు మరమ్మతులు చేయడంతో 27 సంవత్సరాల తర్వాత సాగునీటిని చూస్తున్నాం. పూడికతీతతో భూగర్భ జలమట్టం పెరిగింది. రైతుల కోరిక మేరకు పెద్ద చెరువు నుంచి సాగు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉంది.
– ఉప్ప నారాయణ, రైతు, బీబీపేట్