కంఠేశ్వర్, జూన్ 20: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్సర్వీస్ కమిషన్ పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుంచి 29 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక రాత పరీక్షతోపాటు ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నియామకరాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న నిర్వహించనున్న నీట్, పీజీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
పరీక్షలు పకడ్బందీగా కొనసాగేలా సంబంధిత అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతరాయంగా విత్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. తాగునీరు, ఫస్ట్ఎయిడ్ చికిత్సకు ఏర్పాట్లు చేయాలని, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలని సూచించారు. బయోమెట్రిక్ విధానం నేపథ్యంలో అభ్యర్థులు కనీసం రెండు గంటలముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, పరీక్షల నిర్వహణ,నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ పరీక్షల విభాగం పర్యవేక్షకుడు పవన్, ఆర్టీసీ, వైద్యారోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.