వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ యంత్రాంగం అందిస్తున్న సేవల్లో పారదర్శకతకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఏఈవో యాక్టివిటీ లాగర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పంటల పరిశీలన, విత్తనాల పంపిణీ, పెట్టుబడిసాయం, కొనుగోళ్లు, పీఎం కిసాన్, నష్టపరిహారం, సమావేశాలు, ఫీల్డ్ విజిట్, భూసార పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు తదితర సేవలను అందించేందుకు యాప్ను ప్రవేశపెట్టింది. జూలై 5వ తేదీ నుంచి వీటి సేవలు అందుతున్నాయి. ఈ యాప్ ద్వారా ఏఈవోలు క్షేత్రస్థాయిలో ఎక్కడున్నారో తెలుసుకోవడానికి వీలుంటుంది. లొకేషన్ ఫొటోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏఈవోలు అందించే మొత్తం 17రకాల సేవలను యాప్లో నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఖలీల్వాడి, ఆగస్టు 17 : రైతు వేదిక కేంద్రాల ఆధారంగా పని చేస్తున్న ఏఈవోలు భూసారాన్ని మొదలుకొని పంట చేతికొచ్చే వరకు అమలు చేస్తున్న వివిధ పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 106 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉన్నారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక్కొక్కరూ 5వేల ఎకరాల పరిధి వర కు పని చేస్తారు. రైతు వేదిక పరిధిలో రైతులకు ఏ అంశాలకు సంబంధించిన యాక్టివిటీ నిర్వహించినా తప్పనిసరిగా మొబైల్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మొదట ఏఈవో పనిచేసే ప్రదేశంలో రైతువేదిక వద్దకు వెళ్లిన తర్వాతనే యాప్ పని చేస్తుంది. అక్కడ యాప్ను ఓపెన్ చేసుకొని క్లస్టర్ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి ఫొటో యాప్లో నమోదు చేయాలి. ఇది వరకు వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతు వేదికల వద్దకు వెళ్లి అక్కడే లైవ్ లొకేషన్లో ఫొటో అప్లోడ్ చేసి ఎక్కడికైనా వెళ్లేవారు. ఇప్పుడు ఏ గ్రామంలో ఏ కార్యక్రమంలో ఏఈవో ఉన్నారో ఈ యాప్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం తెలుస్తుంది. ఈ విధానం ద్వారా రైతులకు మరింత పారదర్శకంగా సేవలు అందే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ యాప్ ద్వారా వ్యవసాయ రంగంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే..
క్షేత్రస్థాయిలో వరిపాలనా సౌల భ్యం, పక్కాగా కార్యక్రమాల నిర్వహణ కోసమే ప్రభుత్వం ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిం ది. ప్రస్తుతం ట్రయల్ నడుస్తున్నా.. త్వరలోనే అందుబాటులోకి రానుం ది. దీనిని ఏఈవోలు తప్పనిసరిగా వినియోగించాలి.
– తిరుమలప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి
పక్షంరోజుల్లో పూర్తిగా అందుబాటులోకి యాప్
యాప్ వినియోగంపై జిల్లాలోని ఏఈవోలతో ట్రయల్ చేస్తున్న నేపథ్యంలో మరో పక్షంరోజుల్లో పూర్తిగా అందుబాటులోకి రానున్నది. యాప్ను ప్రభుత్వం మరింత డెవలప్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అటెండెన్స్ పనితీరును పర్యవేక్షించడానికి యాప్ను తేవడంపై ఏఈవోలు కొంత ఇబ్బందిగానే ఉన్నట్లు తెలిసింది. 17 రకాల కార్యక్రమాల ఫొటోలు, వివరాలను అప్లోడ్ చేయడం కష్టంగా మారుతుందని పేర్కొంటున్నారు.