Nizamabad | వినాయక నగర్, జూలై 21 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్ లేని బైక్ పై వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి బైక్ అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారిని వెంబడించగా ఒకరు తప్పించుకుపోగా మరో అనుమానితుడు పోలీసులకు చిక్కాడు. దీంతో అతని తనిఖీ చేయగా అతడి వద్ద బంగారు గొలుసు లభించడంతో అనుమానితునితోపాటు, బైక్ ను సైతం తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న సదరు నిందితుని విచారించగా అతడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందినవాడిగా పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే సదరు నిందితుడి వెంట ఉండి పరారైన మరో అనుమానితుడు అతడి సమీప బంధువేనని పోలీసుల విచారణలో తేలింది.
అయితే అదుపులో ఉన్న అనుమానితుడి వద్ద లభించిన బంగారు గొలుసు ఎక్కడికైనా విచారించగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల పరిధిలో ఓ మహిళ వద్ద నుండి చోరీ చేసినట్లుగా సీసీఎస్ పోలీసుల విచారణలో అనుమానితుడు అంగీకరించినట్లు తెలిసింది. అయితే అతడి వెంట ఉండి పరారైనా మరో నిందితుడి వివరాలు అడగగా, పారిపోయిన నిందితుడు తన సమీప బంధువని పోలీసుల విచారణలో తెలిపాడు. పరారైన మరో నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిజామాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఐ ఆధ్వర్యంలో బృందాన్ని కరీంనగర్ జిల్లాకు పంపించారు. తమ అదుపులో ఉన్న అనుమానుతుని వెంటబెట్టుకొని అక్కడి వరకు వెళ్లిన సీసీఎస్ టీం కండ్లు కప్పి ఆ దొంగ పరారైనట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడిన 24 గంటల వ్యవధిలోనే అనుమానితుడు వారి చెర నుండి పారిపోవడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సీసీఎస్ బృందంపై సీరియస్ గా పరిగణించినట్లు తెలిసింది. అంతేకాకుండా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అనుమానితుడు పరారీకి బాధ్యులుగా చేస్తూ సీసీఎస్ సీఐ తో పాటు అతని వెంట వెళ్లిన సిబ్బందికి పోలీస్ బాస్ ఛార్జ్ మెమో ఇచ్చినట్లు పోలీస్ అధికారుల ద్వారా తెలిసింది.