కాలం కలిసొచ్చింది.. భారీ వర్షాలు కురియడంతో దండిగా నీళ్లున్నాయి.. పుష్కలంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కరెంట్ కష్టాలు లేవు. అన్నీ అనుకూలంగా ఉండడంతో రైతుకు రందీ లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకుంటుంది. వానకాలానికి దీటుగా యాసంగిలో పంటలు సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాలకు మించి పంటలు పండే సూచనలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2022-23 సీజన్కు గాను 5.12 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే లక్ష ఎకరాలకు పైగానే పంటల సాగు అంచనా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. పుష్కలంగా నీటి వనరులు ఉండడం.. విత్తనాలు, ఎరువుల కొరత లేకపోవడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఇక యాసంగిలోనూ సింహా భాగం (3.80 లక్షల ఎకరాల్లో) వరి పంట సాగవ్వనున్నది. వరితో పాటు ఇతర పంటల సాగుపైనా కర్షకులు దృష్టి సారించారు.
నిజామాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎరువులుంటే… విత్తనాలుండవు.. ఇవి రెండూ ఉంటే… కరెంట్ ఉండదు. పోనీ కరెంట్ వచ్చినా… భూగర్భంలో నీళ్లుండవు. భూగర్భంలో నీళ్లుంటే… సాగు చేసే స్తోమత రైతుకుండదు. ఇలా ఒకదానికోటి ముడిపడి ఉన్న సాగు సంబంధాల నుంచి ఇప్పుడిప్పుడే అన్నదాతలు బయట పడుతున్నారు. సమైక్యాంధ్ర సర్కారు తీరుతో నిండుగా మోసపోయి… మునిగిపోయిన కర్షకులు తెలంగాణ రాష్ట్రంలో మూడు కాలాలు పంటలు సాగు చేసుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. బోసిపోయిన చెరువులకు ప్రాణం పోసిన మిషన్ కాకతీయతో రైతులకు ఊరట లభించింది.
నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాతో కర్షక లోకానికి బెంగ తీరినట్లు అయ్యింది. విత్తనాలు, ఎరువుల కొరత లేక… సకాలంలో చేతికి రావడంతో ధీమా రెట్టింపు అవుతున్నది. సాగుకు సిద్ధం అవుతున్న రైతులకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు రాష్ట్ర సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. యాసంగి 2022-23 కాలానికి విత్తన, ఎరువుల కొరత అన్నది లేకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకున్నది. నిజామాబాద్ జిల్లాలో 5.12 లక్షల ఎకరాల్లో సాగు అంచనాలుండగా 17శాతం మేర వివిధ పంటలు ఇప్పటికే సాగుకు నోచుకున్నాయి. మెజార్టీ భాగం వరికే రైతులు మొగ్గు చూపుతుండగా నారుమడుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.
నలుమూలల నారుమడులు…
నిజామాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో 5లక్షల 12 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనాలున్నాయి. ఇందులో మెజార్టీ భాగం 3లక్షల 80వేల ఎకరాల్లో వరి సాగవ్వనున్నది. ఆ తర్వాత జొన్న 40వేల ఎకరాల్లో, శనగ 25,840 ఎకరాల్లో, మక్కజొన్న 20వేల ఎకరాల్లో పంటలు వేసే అవకాశాలున్నట్లుగా నివేదికలు సమర్పించింది. ఇందులో మక్కజొన్న సాగు 101 శాతం దాటిపోయింది. శనగ 88శాతం చేరుకున్నది. 1320 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటను సైతం రైతులు సాగు చేస్తున్నారు. వరి సాగుకు రైతులంతా రెడీ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే పంట ఉత్పత్తులను విక్రయించుకున్న వా రంతా ఏర్పాట్లలో నిమగ్నం అవుతున్నారు.
ఏటా బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోనే అందరి కన్నా ముందుగా నాట్లు వేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది వరి నాట్లు వేయగా ఇదే బాటలో మిగిలిన వాళ్లు పయనిస్తున్నారు. నారుమడులను ఏర్పాటు చేసుకుంటున్నా రు. వారం, పది రోజుల్లోనే నాట్లు ఊపందుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు పైగానే పంట సాగు అంచనాలుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అందుబాటులో ఎరువులు…
యాసంగి సీజన్కు సంబంధించి ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. సీజన్ ప్రారంభానికి ముందు నుంచే ప్రతి సారి ప్రభుత్వమే తగు జాగ్రత్తలను తీసుకుంటూ ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో రైతులకు ఇక్కట్లు తప్పుతున్నాయి. 2021-22 యాసంగిలో యూ రియా 60,703 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ప్రభుత్వం మాత్రం జిల్లాకు 96,651 మెట్రిక్ టన్నులు మేర అవసరమని గుర్తించింది. డీఏపీ గత సీజన్లో 6069 మెట్రిక్ టన్నుల వాడకం జరిగింది. ఈ సారి 26,167 మెట్రిక్ టన్నులు అవసరమని వ్యవసాయ శాఖ తేల్చింది. పొటాష్ గతేడాది 1805 మెట్రిక్ టన్నులు వాడగా, ఈసారి 12,262 మెట్రిక్ టన్నులు వినియోగం కావొచ్చని చెబుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు గతేడాది 39వేల మెట్రిక్ టన్నులు వినియోగం కాగా ఈసారి యాసంగిలో 37,427 మెట్రిక్ టన్నుల్లో అవసరం పడొచ్చని చెబుతున్నారు.
ఇక విత్తన కొరత లేకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉంది. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే సత్ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. తద్వారా అనేక ప్రయోజనాలను పొందేందుకు ఆస్కారం ఉంటుందని అవగాహన కల్పిస్తున్నది. ఒకే రకమైన పంటను ఏండ్లుగా సాగు చేయడం ద్వారా భూమిలో సత్తువ నశించి పోయి చీడ పురుగుల దాడి పెరిగి పంట నిలబడడం కష్టంగా ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
ధైర్యంగా సాగు బాట…
ఎనిమిదేండ్ల క్రితం వరకు చెరువుల్లో నీళ్లు లేక వ్యవసాయ క్షేత్రాలన్నీ బీడు భూములుగా మిగిలా యి. సాగు నీరు లేక ఏం చేయాలో తెలియక అన్నదాతలు ఖాళీగానే ఉండిపోయారు. అనధికారికంగా క్రాప్ హాలీడే పాటించారు. కానిప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెరిగిన జల సంపదతో సాగు విస్తీర్ణం రెండింతల మేర పెరిగింది. యాసంగి సాగు అంటేనే భయపడే రైతులంతా ఇప్పుడు కొండంత ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారడంతో సాగుకు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు.
సాధారణంగా నీటి లభ్యత తక్కువగా ఉండడాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసేవారు. ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సైతం యాసంగిలో వరి వేయకుండా ఆరుతడి పంటలే సాగు చేయాలని రైతులకు సూచించేది. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. భారీ వర్షాలు కురిసి సాగు నీటి వనరులు నిండుగా ఉండడంతో అత్యధిక మంది రైతులు వరి పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో ఆశాజనకంగా నీళ్లు ఉండడం అనేక తటాకాల్లో జల వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో యాసంగికి ఢోకా లేదు.