నిజామాబాద్ క్రైం, మార్చి 16: నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. వన్టౌన్ ఎస్హెచ్వో డి.విజయ్బాబు, బాధితురాలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వైష్ణవి దవాఖానకు జిన్నాబాయి తన కూతురును తీసుకొని గురువారం వచ్చింది. కూతురు డాక్టర్ వద్దకు చెకప్ కోసం వెళ్లగా.. ఆమె హాల్లోని ఓ కుర్చీలో కూర్చున్నది. ఇంతలోనే బుర్కా ధరించిన ఓ మహిళ.. కుర్చీ వెనుక వైపునకు వచ్చి జిన్నాబాయికి ముఖంపై బుర్కా కప్పినట్లు చేసింది.
సదరు మహిళ క్షణాల్లో జిన్నాబాయి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసుతో పాటు రూ.ఐదు వేల నగదును చోరీ చేసింది. ఆమె వెంట ఉన్న బుర్కా ధరించిన మరో మహిళ కలిసి దవాఖాన నుంచి బయటికి వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తేరుకున్న బాధితురాలు చోరీ ఘటనపై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్హెచ్వో విజయ్బాబు తెలిపారు. దవాఖానకు వచ్చే రోగులు, వారి బంధువులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలన్నారు.