కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నది ఈ క్రీడాకారిణి. కఠోర సాధనతో జాతీయ స్థాయికి ఎదిగింది. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిత ఉంటుందని చాటి చెబుతున్నది. ఈత కొలనులో మెరుపు వేగంతో ఈదుతూ పతకాలు సాధిస్తున్నది. స్విమ్మింగ్పై ఆసక్తితో నిత్యం సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నది నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన రిత్విక. అరేబియా సముద్రంలో రెండు కిలోమీటర్లు ఈదిన రిత్విక.. ఇప్పటి వరకు వివిధ పోటీల్లో 34 బంగారు పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసింది.
నవీపేట,డిసెంబర్ 15: గ్రామీణ ప్రాంతానికి చెందిన రుత్విక జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మెరుగైన ప్రతిభ చూపుతూ దూసుకెళ్తున్నది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని మారుమూల బినోలా గ్రామానికి చెందిన మిట్టాపల్లి రిత్విక స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తాచాటుతూ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్నది. గత నవంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్ జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చి ఈ నెల 27, 28, 29 తేదీల్లో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో నిర్వహించే జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైంది.
కుటుంబ నేపథ్యం..
నవీపేట మండలం బినోలా గ్రామంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన మిట్టాపల్లి ప్రకాశ్రావు- ప్రమీల దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ప్రకాశ్ రావు ప్రైవేటు ఉద్యోగి, ప్రమీలా (గృహిణి). కాగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రకాశ్ రావు 2017లో హైదరాబాద్కు మకాం మార్చారు. పెద్ద కూతురు రిషిక రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ క్రీడాకారిణి కాగా ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూలో కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. రెండో కూతురు మిట్లాపల్లి రిత్విక హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది. కాగా ఇద్దరు అక్కాచెళ్లెల్లు రిషిక, రిత్వికలకు చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ పోటీలు అంటే ఇష్టంగా పాల్గొంటూ వస్తున్నారు. అక్క రిషిక రాష్ట్రస్థాయి పోటీలకే పరిమితం కాగా రిత్విక పట్టువదలని విక్రమార్కునిలా ఎక్కడా స్విమ్మింగ్ పోటీలు ఉన్నా చురుకుగా పాల్గొంటూ పతకాలను సాధిస్తూ వస్తున్నది.
అరేబియా సముద్రంలో రెండు కిలోమీటర్లు ఈదిన రిత్విక..
మహారాష్ట్రలోని మాల్వన్ సిటీ సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో 2019లో నిర్వహించిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో రెండు కిలోమీటర్లు ఈది సత్తాచాటి సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్నది. జాతీయస్థాయి పోటీలో అరేబియా మహా సముద్రంలో స్విమ్మింగ్ చేసిన ఏకైక క్రీడాకారిణిగా మన్ననలు పొందింది.
34 గోల్డ్ పతకాలు కైవసం..
2018 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పలు పతకాలను రిత్విక తన ఖాతాలో వేసుకున్నది. 34 బంగారు, 6 సిల్వర్, 7 కాంస్య పతకాలతోపాటు కప్లను గెలుచుకున్నది. రాజ్కోట్, గుజరాత్ రాష్ర్టాల్లో అక్టోబర్ 22న నిర్వహించిన 36వ జాతీయ స్థాయి పోటీల్లో ఆలిండియాలో ఐదో స్థానం సాధించింది. కాగా బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో పాల్గొన్న ప్రతి ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించి జిల్లాకు పేరు తేవడం గర్వకారణం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్న రిత్వికను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గడీల రాములు, మహిపాల్రెడ్డి అభినందించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో రాణించేందుకు అమ్మానాన్నలు ప్రోత్సహించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దాతల సహాయంతోపాటు కోచ్ సహకారంతో ఈత పోటీల్లో విజయం సాధిస్తూ అనేక పతకాలను గెలిచాను. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కర్నాటకలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలో ప్రతిభ కనబర్చి పతకం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న.
– రిత్విక, స్విమ్మింగ్ క్రీడాకారిణి